హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బాలికల చదువుకు సర్కారు మరింత భరోసా కల్పించింది. రాష్ట్రంలోని మరో 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) ఇంటర్స్థాయికి అప్గ్రేడ్ చేసింది. వీటిలో 2021- 22 విద్యాసంవత్సరం నుంచే ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఒక్కో కేజీబీవీలో రెండు కోర్సుల (ఎంపీసీ, బైపీసీ లేదా సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ లేదా ఏవేనీ రెండు) చొప్పున నిర్వహించనున్నట్టు తెలిపారు. తాజాగా అప్గ్రేడ్ చేసినవి కలిపితే మొత్తం 208 విద్యాలయాలు ఇంటర్స్థాయికి అప్గ్రేడ్ అయ్యాయని పేర్కొన్నారు. వీటిలో చేరిన బాలికల వసతి, చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తున్నదని, పోషకాహారంతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్నదని పేర్కొన్నారు. నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా కరాటే, యోగా, ధ్యానం తదితర అంశాల్లోనూ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. గతంలో కేజీబీవీల్లో 8వ తరగతి వరకు మాత్రమే బోధించేవారు. బాలికల విద్యపై ఏర్పాటైన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) సిఫారసులతో ఇంటర్ వరకు క్రమంగా అప్గ్రేడ్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని మొత్తం కేజీబీవీలు : 475
ఇంటర్ కోర్సులు నిర్వహిస్తున్నవి : 172
తాజాగా అప్గ్రేడ్ చేసినవి : 36
కోర్సులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ.
తెలుగు/ ఇంగ్లిష్ మీడియం బోధన