హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ చేపట్టే పలు ఉద్యోగాల భర్తీలో మహిళలకు అన్ని క్యాటగిరీల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు మ ధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులతోపాటు 833 ఏఈ, 175 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిరుడు నోటిఫికేషన్ జారీచేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబ డి ఈ పోస్టుల్లోని అన్ని క్యాటగిరీల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం మాధవీదేవి విచారణ జరిపారు. రాజేశ్కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతరుల మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం మహిళలకు అన్ని క్యాటగిరీల్లో సమాంతరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని టీఎస్పీఎస్సీ ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేశారు.