Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వార్తను చదవాలి. అందులో ఏముందో తెలుసుకోవాలి. విషయాన్ని అవగతం చేసుకోవాలి. ఆ తర్వాతే వివరణకో, విమర్శకో దిగాలి. అంతేకానీ, కేవలం హెడ్డింగులు చూసి ఎగిరెగిరి పడొద్దు! ఒకవేళ పడితే.. అది మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో అభాసుపాలైనట్టే ఉంటుంది.
‘నాదర్గుల్ భూముల్లోకి మేఘా ఎంట్రీ’ అని నమస్తే తెలంగాణ తొలుత రాసిందని, తర్వాత రెండురోజులకు తాను కబ్జా చేసినట్టు రాసిందని మంత్రి మీడియా ముందు చెప్పుకొచ్చారు. నాదర్గుల్ భూములపై నమస్తే తెలంగాణ ఆధారాలతో ప్రచురించిన తొలి క థనం.. ‘పొంగు’తున్న భూదందా!’తో దిమ్మతిరిగి దాన్ని తన ప్రెస్మీట్లో చూపించకుండా దాచిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత రాసిన మేఘా ఎంట్రీ కథనాన్నే ఆ సిరీస్లో మొదటి కథనంగా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అసలు విషయాన్ని వదిలేసి, శీర్షికలను శీర్షాసనంలో చూసినట్టు తేలిపోయింది.
నాదర్గుల్లోని 323 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఓ రేకుల ప్రహరీని కట్టి.. దానిపై మొదట ‘కోహినూర్ గ్రూప్’ పేరిట బోర్డు వెలిసింది. నాదర్గుల్ అక్రమాలను బద్ధలుకొట్టిన మొదటి కథనం అదే. ఆ కోహినూర్ గ్రూప్ సోదర సంస్థలు.. రాఘవ కన్స్ట్రక్షన్స్, ఏక్యూ స్కేర్, క్రిస్టల్! రాఘవ కన్స్ట్రక్షన్స్ తమ కుటుంబానిదేనని మంత్రి మర్చిపోయినట్టున్నారు. మరునాడు మేఘా ఇంజినీరింగ్-శిల్పా ఇన్ఫ్రా పేరిట బోర్డు వెలిసిందని నమస్తే తెలంగాణ ఫొటోలు సహా ప్రచురించింది. అయితే మేఘా ఎంట్రీ అంటూ కథనం రాశారని చెప్పిన పొంగులేటి.. కన్వీనియెంట్గా శిల్పా ఇన్ఫ్రా పేరును వదిలేశారు. శిల్పా ఇన్ఫ్రాలో డైరెక్టర్లు ఎవరు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చం ద్రమోహన్రెడ్డి, శిల్పా రాఘవ వెంచర్స్. మరి శిల్పారాఘవ ఎల్ఎల్పీలో డైరెక్టర్లు ఎవరు?.. పొంగులేటి హర్షారెడ్డి, పొంగులేటి లోహిత్రెడ్డి, పొంగులేటి స్వప్నిరెడ్డి! అంటే మన మంత్రిగారి కుటుంబమే!
రెండో కథనం తర్వాత.. తెల్లారేసరికి ఆ బో ర్డులపై తెల్లరంగు వచ్చి చేరింది. ప్రభుత్వ ఆధీనంలో, బౌన్సర్ల భద్రతలో ఉన్న ఆ భూమిలో బోర్డును ఎవరు చెరిపివేశారు? తర్వాత కోహినూర్ గ్రూప్-ఇంప్లెక్స్ ఇన్ఫ్రా ఉమ్మడి బోర్డు ప్రత్యక్షమైంది. కోహినూర్లో రాఘవ కన్స్ట్రక్షన్ భాగస్వామి కదా! పాపం.. మంత్రికి తెలియదట! ఆ వివాదాస్పద స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి అనుమతి కోరుతూ అధికారికంగా దరఖాస్తు చేసుకున్నది ఏక్యూ స్కేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్. ఏక్యూ స్కేర్లో భాగస్వాములెవరు? కోహినూర్ కన్స్ట్రక్షన్స్, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్, క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. క్రిస్టల్ మ్యాన్షన్స్లో డైరెక్టరు మంత్రి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డే! ఇదీ మంత్రిగారి ఫ్యామిలీ బిజినెస్!
నిషేధిత జాబితాలో ఉన్న నాదర్గుల్ భూముల్లో ఈ బోర్డుల వ్యవహారం ఎలా మారుతూ వచ్చిందో నమస్తే తెలంగాణ ఎప్పటికప్పుడు కథనాలు ప్రచురించింది. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ప్రెస్మీట్ పెట్టిమరీ బోర్డుల మార్పిడీ వెనుక పొంగులేటి కుటుంబం ఉన్నట్టు ఆధారసహితంగా బయటపెట్టారు. ఇది కూడా అర్థం చేసుకోలేని మంత్రి.. ‘మొదట మేఘా ఎంట్రీ అన్నారు.. తెల్లారి నామీద రాశారు’ అంటూ ఏదేదో చెప్పుకొచ్చారు.
కేటీఆర్తో మీటింగ్ తర్వాత తనపై పడ్డారన్నది మంత్రిమాట. కానీ మేఘాతోపాటు శిల్పా ఇన్ఫ్రా ఉన్నదంటూ రాసిన విషయంపై పొంగులేటి ఎందుకు మాట్లాడరు? మంత్రి చెప్తున్నట్టు.. ఒకవేళ మీటింగ్ జరిగి ఉంటే, నాదర్గుల్ భూముల్లో ప్రైవేట్ సైన్యం కాపలాకాస్తున్న బోర్డును మీరెందుకు చెరిపివేశారు? కొత్త కంపెనీల పేర్లు ఎందుకు రాసుకొచ్చారు? మేఘాతో ఒప్పందమే కుదుర్చుకుని ఉంటే.. హరీశ్రావు తన ప్రెస్కాన్ఫరెన్స్లో మేఘా పేరును ఎందుకు ప్రస్తావిస్తాడు? మేఘా-శిల్పా బంధాన్ని, నాదర్గుల్లో కలిసి ఆడుతున్న నాటకాన్ని ఆధారాలతో హరీశ్ ఎందుకు బయటపెడుతా డు? వాటికి మంత్రి సమాధానం చెప్పలేకపోయారు.