Cycling For Save Soil | తెలంగాణలోని జనగామ జిల్లా వాసి కొత్తపల్లి నాగరాజు (32). భూమాతను కాపాడండంటూ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ క్యాంపెయిన్పై ప్రజల్లో అవగాహన కల్పించ తలపెట్టాడు. అంతే రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా 2,000 కి.మీ.కు పైగా దూరం సైకిల్ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ నెల 17న ఉప్పల్లో మొదలైన ఈ సైకిల్ యాత్ర 26న తిరిగి ఉప్పల్ వద్ద ముగిసింది. పీపుల్స్ ప్లాజా వద్ద మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఈ యువకుడి సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. భూమిని కాపాడాలన్న భావనను తాను ప్రేమిస్తున్నట్లు మర్రి లక్ష్మణ్ రెడ్డి చెప్పారు.
ప్రతి రోజూ 4.30 గంటలు తన సైకిల్ యాత్ర మొదలై అర్ధరాత్రి పొద్దుపోయే వరకు సాగిందని నాగరాజు తెలిపారు. తన వస్తువులతో కూడిన మినీ వ్యాన్ తన వెంట వచ్చేదన్నారు. చిన్న నాటి నుంచే పలు సైక్లింగ్ పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. చిన్నతనంలో రెండు రూపాయలు చెల్లించి సైకిల్ అద్దెకు తీసుకుని గంటసేపు సైక్లింగ్ చేసేవాడినన్నారు. టీనేజీ వయస్సు ప్రారంభంలోనే ప్రొఫెషనల్ సైక్లింగ్ గురించి తాను తెలుసుకోగలిగానన్నారు.
ఒక డెకథ్లాన్ ఉద్యోగిగా నాగరాజు ఇంతకుముందు మద్యం తాగి వాహనం నడుపొద్దని, ఉమెన్ సైక్లింగ్, స్వచ్ఛ తెలంగాణ తదితర సోషల్ క్యాంపెయిన్లలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు సార్లు యాత్రలో పాల్గొన్నందుకు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. నాగరాజు సైకిల్ యాత్ర కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు 3800 కి.మీ. దూరాన్ని 36 రోజుల్లో పూర్తి చేశారు. మనాలీ నుంచి కశ్మీర్-ఖార్దుంగ్లా వరకు పది రోజుల్లో సైకిల్, మోటార్ సైకిల్ మీదుగా యాత్ర జరిపాడు.