హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): దసరా పండుగ ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే దసరా సెలవులు రావడం, పండుగ దగ్గరపడుతుండటంతో చాలా మంది హైదరాబాద్ను వదిలి సొంత ఊర్లకు చేరుకొంటున్నారు. పండుగ రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ బస్సు సర్వీస్లకు అదనంగా 4వేల వరకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఆయా రూట్లలో ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ స్పెషల్ సర్వీసెస్ను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. వారం రోజులుగా ప్రయాణికుల సంఖ్య సరాసరిన రోజుకు 27 లక్షల నుంచి 32 లక్షల వరకు పెరుగుతున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం మరింత రద్దీ ఉండనున్న దృష్ట్యా మంగళ, బుధవారాల్లో అన్ని రూట్లలో బస్సుల సంఖ్య పెంచనున్నట్టు తెలిపారు.