Telangana Elections | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ మేరకు అధికారులు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాలకు 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 15 నియోజకవర్గాల్లో 20 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో 173 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, ఎల్బీనగర్లో 38, మహేశ్వరంలో 27, రాజేంద్రనగర్లో 25, శేరిలింగంపల్లిలో 33, చేవెళ్లలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 48 మంది పోటీలో ఉన్నారు. పరిగిలో 15, వికారాబాద్లో 12, తాండూరులో 21 మంది పోటీ చేస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 70 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 173 మంది బరిలో మిగిలారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 24 మంది పోటీ చేస్తుండగా, గద్వాల నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నారాయణపేటలో కేవలం ఏడుగురు మాత్రమే పోటీలో ఉన్నారు.