దేశంలోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం నిలుస్తున్నది. హైదరాబాద్ నగరంలో కడుతున్న లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లనిర్మాణానికి చేసిన ఖర్చు రూ.9,700 కోట్ల పైమాటే. ప్రభుత్వం కడుతున్న ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల మార్కెట్ విలువ 60 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి ఆస్తిని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇస్తున్నది. ఇప్పటిదాక 30 వేల ఇండ్లను అందించినం. మిగిలిన ఇండ్లనూ త్వరలోనే పంచుతం.
– మంత్రి కేటీఆర్
Minister KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ విషయాలను ప్రకటిస్తారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలవేళ రాష్ర్టానికి విపక్ష నాయకులు క్యూ కడుతున్నారని, అడ్డగోలు హామీలు ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని అన్నారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చి బూటకపు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, మాట్లాడారు. తెలంగాణ సర్కారు ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతున్నదని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. పేదలు, రైతులపైన కేసీఆర్ కన్నా అత్యంత ప్రేమ కలిగిన నాయకుడు దేశంలో ఎవరూ లేరని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు పనితో గెలువలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని.. ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని విమర్శించారు. వాళ్లు ఇచ్చిన దొంగ హామీలు నమ్మి మోసపోదామా? అని ప్రశ్నించారు. వాళ్లు చెప్పినదానికంటే ఎకువ సంక్షేమం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఆ విషయాలను అతి త్వరలోనే సీఎం కేసీఆర్ వెల్లడిస్తారని, ప్రజలు తొందరపడొద్దని సూచించారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
కొత్తగా రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ ఈ తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో జోడెద్దుల్లా తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తున్నదని, ఈ ప్రగతి చక్రం ఆగొద్దంటే మళ్లీ పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఏ బస్తీకి పోయినా మంచినీళ్ల కోసం లొల్లి ఉండేదని, ఖైరతాబాద్ జలమండలి ముందు ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి ధర్నాలు చేసేవాళ్లని ఉమ్మడి పాలన తీరును ఎండగట్టారు. కరెంట్ విషయానికొస్తే అపార్ట్మెంట్ కిందకు వెళ్తే డీజిల్ కంపుతో ముకులు పగిలిపోయేవని, ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకపోతే జ్యూస్ స్టాళ్లు, జిరాక్స్ సెంటర్లు నడుపుకోలేని దుస్థితి ఉండేదని గుర్తుచేశారు.
స్వరాష్ట్రంలో కరెంట్, నీటికష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయని తెలిపారు. గణేశ్ పండుగ వచ్చిందంటే వారంపాటు కర్ఫ్యూ కంపల్సరీ ఉండేదని, ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని, మంచినీళ్ల సౌలత్ మంచిగైందని, రోడ్లు బాగయ్యాయని, పేదలకు కడుపు నిండా పింఛన్ వస్తున్నదని, డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకుపోతున్న ఈ ప్రగతి చక్రాలను ఆపేందుకు.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ముందు కొంతమంది వచ్చి బూటకపు హామీలు ఇస్తున్నారని, అలాంటి వాళ్ల మాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అందరికీ ఇండ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి అందరికీ ఇండ్లు ఇవ్వాలని తమకు కూడా ఉన్నదని, కానీ మధ్యలో రెండేండ్లు కరోనాలాంటి సంక్షోభం, దానివల్ల ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నదని వివరించారు. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసుకున్నామని, రైతు బంధు కింద రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాలో వేస్తున్నామని చెప్పారు. దళిత బంధువంటి విప్లవాత్మక పథకం తెచ్చి దళితోద్ధరణలో భారతదేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. పారిశ్రామికీకరణ, కొత్త పరిశ్రమలు ఆకర్షించడంలోనూ ముందున్నామని, త్వరలో దుండిగల్కు కూడా కొత్త పరిశ్రమను తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ ప్రాంతం రూపురేఖలు తప్పకుండా మారుస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు ముద్దం నర్సింహయాదవ్, మందాడి శ్రీనివాస్, ఆవుల రవీందర్రెడ్డి, పండాల సతీశ్గౌడ్, కంటోన్మెంట్ నియోజవకర్గ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్లు అనుదీప్, హరీశ్, అమోయ్కుమార్, జోనల్ కమిషనర్ మమత, మేడ్చల్ జిల్లాకు చెందిన కౌన్సిలర్లు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ప్రోగ్రాం ఆధారంగా పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల పాత్ర లేదని తేల్చి చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందితే చాలు అన్న కేసీఆర్ మార్గదర్శనం మేరకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్ (వార్డు నంబరు 126) కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కౌసల్యకు మొదటి విడతలో డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని.. అదే డివిజన్లోనే బీజేపీ నాయకురాలు సునీతకు కూడా మొదటి విడతలోనే ఇల్లు వచ్చిందని వివరించారు.
లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై పరోక్షంగా సెటైర్ వేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఇండ్ల పట్టా అందుకుంటున్న సందర్భంగా ఏం చేస్తావని కేటీఆర్ ప్రశ్నించగా.. చాయ్ అమ్ముకుంటానని ఆమె బదులిచ్చారు. దీంతో చాయ్ అమ్ముకొనే వాళ్లు దేశాన్ని మోసం చేయొద్దని కేటీఆర్ అన్నారు. అనంతరం ‘నీ గురించి అనలేదు.. కంగారుపడొద్దు’ అని సదరు మహిళకు సూచించారు. చాయ్ అమ్మి దేశాన్ని మోసం చేసే వాళ్ల గురించి అన్నానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీపై కేటీఆర్ వేసిన సెటైర్కు సభికులంతా చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం విశేషం.
‘ఇల్లుకట్టి చూడు.. పెండ్లి చేసి చూడు’ అని గతంలో పెద్దలు అనేవారని, కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్ మాత్రం ‘ఇల్లు నేనే కట్టిస్తా..పెండ్లి నేనే చేయిస్తా’ అంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం నిలుస్తుందని తెలిపారు. పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల విలువ రూ.9,700 కోట్ల పైమాటేనని, ప్రభుత్వం కట్టిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు మార్కెట్ విలువ రూ.50 వేల కోట్ల నుంచి 60 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తులను పేదల చేతిలో పెడుతున్నదని తెలిపారు. ఇప్పటివరకూ లబ్ధిదారులకు 30 వేల ఇండ్లు అందించామని, మిగిలిన 70 వేల ఇండ్లను త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఇంతపెద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన జీహెచ్ఎంసీ అధికారులకు, అత్యంత పారదర్శకంగా ఇండ్లు పంపిణీ చేస్తున్న మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లకు ఈ సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలిపారు.