మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 10 : కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే సంచార జాతులకు ఆసరా లభించిందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సిరిగిరి శ్రీను, బీఆర్ఎస్ నాయకుడు ఎండీ ఖాజాపాషా ఆధ్వర్యంలో సుమారు 300 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. బుడగ జంగాలకు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనానికి నిధులు కూడా అందించినట్టు గుర్తుచేశారు. తెలంగాణను దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ ప్రపంచంలో మన దేశాన్ని కూడా అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినట్టు తెలిపారు. తెలంగాణ మాదిరిగా అన్ని రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్తు తదితర పథకాల అమలే లక్ష్యంగా బీఆర్ఎస్ను ముందుకు నడిపించనున్నట్టు పేర్కొన్నారు.