Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కర్ణాటక పరిస్థితి పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. గత బీజేపీ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విసిగివేసారిన కన్నడ ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఈ ఆరు నెలల్లో కుదేలైంది. సాగుకు నిరంతర విద్యుత్తు ఇస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు, మూడు గంటలకు మించి సరఫరా చేయకపోవటంతో చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండిపోయాయి. దీంతో గుండె పగిలిన రైతన్న దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మే నెలలో కొలువుదీరింది మొదలు సెప్టెంబర్ చివరి నాటికి 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. అంటే సగటున నెలకు 50 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మే-సెప్టెంబర్ మధ్య ఆత్మహత్యల కంటే అక్టోబర్లో రైతుల ఆత్మహత్యల సంఖ్య ఎక్కువేనని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ హమీలను నమ్మి నట్టేట మునిగింది
కర్ణాటకలో సహజసిద్ధంగా మెట్ట పంటలకు అనువైన నేలలు ఉన్నాయి. జొన్న, సజ్జ, కందులు, మక్కజొన్న, మిర్చి వంటి వాణిజ్య పంటలను అధికశాతం సాగు చేస్తారు. మొదట వీటిని వర్షాధారంగా సాగుచేసి పంట చివరలో ప్రాజెక్టులు, చెక్ డ్యామ్లు, గొట్టపు బావుల ద్వారా నీరు అందించటం అనవాయితీ. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మించింది. దీంతో రైతులు ఆ పార్టీకి పట్టం కట్టారు. అయితే ఆ హామీని తుంగలో తొక్కిందా సర్కారు. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. మొదట 7 గంటలు అని, తర్వాత 5 గంటలు అని మాట మార్చింది. కానీ, లో వోల్టేజీ సమస్యతో 2-3 గంటలకు మించి సరఫరా చేయలేదు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే 65 లక్షల హెక్టార్లలో చేతికొచ్చిన పంటలు ఎండిపోయాయి. ఈ నష్టం విలువ రూ.33,700 కోట్లు అని అక్కడి ప్రభుత్వమే ప్రకటించింది. కండ్ల ముందు పంట చేతికి రాకుండా పోవటంతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
చేతులెత్తేసిన సర్కార్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఉత్పాదన పడిపోవటం, వర్షాభావ కరువు పరిస్థితులతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నట్టు సీఎం సిద్ధరామయ్య కేంద్రానికి లేఖ రాశారు. బీజేపీని గద్దె దించి కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారన్న కక్షతో ప్రధాని మోదీ తమ రాష్ట్రంపై కక్ష కట్టారని ఆయన బాహాటంగానే కేంద్రంపై విరుచుకుపడ్డారు. అయితే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రం.. కేంద్రాన్ని నిందిస్తే సరిపోదు, రైతులను ఆదుకోవడానికి, పంటలను కాపాడుకోవడానికి ఎందుకు చర్యలు చేపట్టలేదని ఎదురుదాడికి దిగింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు విద్యుత్తును ప్రైవేట్ సంస్థల నుంచి పొరుగు రాష్ర్టాల నుంచి కొనకపోవటం కూడా రైతుల ఆత్మహత్యకు కారణమైంది. ఈ అంశాలన్నీ తెలంగాణలో ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారాయి. పైగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ పార్టీని తెలంగాణలో గెలిపిస్తే కర్ణాటక తరహాలో పథకాలు అమలు చేస్తామనటంతో అక్కడి వైఫల్యాలు తెరపైకి వచ్చి బ్యాక్ ఫైర్ అయింది.
36