జుక్కల్.. ఒకనాడు ఈ ఊరు తెలంగాణలో ఉందన్న విషయం ఎవరికీ తెల్వదు.నీళ్లు లేవు, రోడ్లు లేవు, యువతకు ఉపాధి లేదు, మొత్తంగా ఇక్కడి ప్రజలకు అభివృద్ధి అంటేనే తెల్వదు. ఏ నాయకుడూ పట్టించుకోలే.. ఏ ప్రభుత్వమూ కన్నెత్తి చూడలే. తెలంగాణ వచ్చినంకనే అభివృద్ధి అంటే ఏమిటో పరిచయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందించింది. యువతకు ఉపాధి కల్పించింది. తొమ్మిదేండ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో కండ్ల ముందు ఉంచింది.
Jukkal | నిజామాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిజాంసాగర్: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దులో ఉండే జుక్కల్ నియోజకవర్గం తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పథాన సాగుతున్నది. ఉమ్మడి పాలనలో తలాపునే నిజాంసాగర్ ఉన్నా సాగు, తాగునీటికి అల్లాడిన ప్రాం తం నేడు కాళేశ్వర జలాలతో పాడిపంటలతో పచ్చగా మారింది. ఏకంగా నాలుగుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సౌదాగార్ గంగారాం.. ఎన్నడూ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలే. నిధులూ తీసుకురాలే. కనీసం గ్రామాలకు రోడ్ల సౌకర్యాన్ని కల్పించలే. తెలంగాణ వచ్చినంక ఎమ్మెల్యే హన్మంత్ షిండే అభివృద్ధి పనులు చేపట్టారు. బిచ్కుందలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గతంలో ప్రాథమిక ఆ రోగ్య కేంద్రంగా ఉన్న ఈ దవాఖానను అంచెలంచెలుగా ఉన్నతీకరించారు.
ప్రస్తుతం 30 పడకల ఈ దవాఖాన అద్భుతంగా వైద్యసేవలను అందిస్తున్నది. పిట్లం, బిచ్కుందలో వం ద పడకల దవాఖానలు, బిచ్కుందలో డయాలసిస్ కేంద్రంతోపాటు విరివిగా పల్లె దవాఖానల ఏర్పాటుతో నాణ్యమైన వైద్యం ప్రజలకు చేరువైంది.ఎప్పుడూ ఎండి కనిపించే నిజాంసాగర్ ప్రాజెక్టు స్వరాష్ట్రంలో కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారింది. నిజాంసాగర్ ఆయకట్టు కింద రెండు పంటలు పండుతున్నాయి. మరో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా నిజాంసాగర్ మండలంలో మం జీరా పరీవాహక ప్రాంతంలో 436 కోట్లతో నాగమడుగు మత్తడిని నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మండలాల్లోని నాన్కమాండ్ ఏరియాకు సాగునీటి ఇబ్బందులు ఉండవు. 120 గ్రామాలకు బీటీ రోడ్లు పడ్డా యి.
నిజాంసాగర్ మండలంలో 1,298 దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున అందజేశారు. రెండోవిడతలో మరో 277 కుటుంబాలకు దళిత బంధు సాయం అందించారు. బిచ్కుందలో డిగ్రీ కళాశాలతోపాటు ప్రతి మండలంలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయించారు. గురుకుల, ఆదర్శ పాఠశాలలు, కస్తుర్బా పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించారు. మన ఊరు మన బడి పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. ఫలితంగా నియోజకవర్గంలో విద్యావ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి.