జగిత్యాల, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : కంటి వెలుగు రెండో దశలో రాష్ట్రంలోని 3 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. కంటి వెలుగు-2 కార్యక్రమ అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుంచి మంగళవారం మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు -2 కార్యక్రమాన్నిప్రారంభిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు.
రాష్ట్రంలో దృష్టి లోపాలను సవరించేందుకు సీఎం కేసీఆర్ రూపొందించిన మహత్తర కార్యక్రమం కంటి వెలుగు అని ఆయన పేర్కొన్నారు. మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు కొనసాగిందని, రెండో దశ మాత్రం కేవలం వంద పనిదినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు. గతంలో ఉన్న వైద్య, పరీక్షల బృందాలకు అదనంగా మరో 1,500 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనిటీ స్రీనింగ్ అని, దీన్ని ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. 960 మంది వైద్యులను వారం రోజుల్లోగా నియమిస్తామని పేర్కొన్నారు. రోజువారీ వైద్యారోగ్య శాఖ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. దృష్టి లోపంతో బాధపడే వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి పాల్గొన్నారు.
భీమ్గల్, ఆర్మూర్లో త్వరలో డయాలసిస్ కేంద్రాలు
వేల్పూర్/భీమ్గల్/నందిపేట్: నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్, ఆర్మూర్ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన వేల్పూర్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం ఆర్మూర్ దవాఖానను తనిఖీ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వేముల కోరగా అందుకు భీమ్గల్ కేంద్రంగా రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తానని హరీశ్రావు తెలిపారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి వినతి మేరకు ఆర్మూర్లో పది రోజుల్లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీరి వెంట ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, వీజీ గౌడ్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.