ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరొకరు
నిందితుల్లో మాజీ పశు వైద్యాధికారి
ఘట్కేసర్ రూరల్, జూన్ 10: సబ్సిడీ గొర్రెలను ఇప్పిస్తామని గొల్ల, కుర్మలను నమ్మించి కోట్లు కాజేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని కొర్రెములలో జూనియర్ పశువైద్యాధికారిగా పని చేస్తున్న సజ్జా శ్రీనివాస్, ఆయన భార్య సజ్జా లక్ష్మి, అనిల్ కుమార్, కొల్లి అరవింద్కుమార్ సబ్సిడీపై గొల్లకుర్మలకు గొర్రెలను అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన గొల్ల కుర్మలు ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రూపులను లక్ష్యంగా చేసుకున్నారు.
గొర్రెల పథకం ద్వారా అందించే యూనిట్కు (20 గొర్రెలు, ఒక్క పొట్టేలుకు రూ.1.25 లక్షలు) ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తున్నది. లబ్ధిదారుడు 25 శాతం అంటే రూ.31,250 ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అసరా చేసుకున్న జూనియర్ పశువైద్యాధికారి సజ్జా శ్రీనివాస్ 25 శాతం చెల్లించి తీసుకున్న సబ్సిడీ గొర్రెలను బహిరంగా మార్కెట్లో అమ్మటం ద్వారా వచ్చే మొత్తంలో సగం వాటా ఇస్తామని నమ్మించి అమాయకుల నుండి డిపాజిట్ల రూపంలో రూ.8 కోట్లు వసూలు చేశాడు. వసూలు చేసిన మొత్తాన్ని నిందితులు సమానంగా పంచుకున్నారు. డబ్బులు చెల్లించిన వారు గొర్రెల యూనిట్ల కోసం అడుగుతుండటంతో 8 నెలల క్రితం ఉద్యోగాన్ని వదిలి శ్రీనివాస్ పరారయ్యాడు. వీరిపై ఘట్కేసర్ పోలీసు స్టేషన్తో పాటు పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఘట్కేసర్ పోలీసులు నిందితులు సజ్జా శ్రీనివాస్, సజ్జా లక్ష్మి, కొల్లి అరవింద్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు శ్రీనివాస్ బావమరిది అనిల్కుమార్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.