ఖమ్మం రూరల్, మే 9 : వేసవి సెలవులు కావడంతో ముగ్గురు చిన్నారులు సరదాగా ఈత కొట్టేందుకు మున్నేరు వాగు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన ఖమ్మం నగర శివారులోని మున్నేరు వాగులో గురువారం చోటుచేసుకున్నది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మమత వైద్యశాల వెనుక రామచంద్రయ్య నగర్కు చెందిన ఆముదాల చిరంజీవి, లక్ష్మి దంపతుల ఇద్దరు కొడుకులు లోకేశ్ (12), హరీశ్ (10)తోపాటు అదే కాలనీకి చెందిన బానోత్ కళావతి కుమారుడు గణేశ్(9) ఈత కొట్టేందుకు దంసలాపురం-గుదిమళ్ల మధ్యలోని మున్నేరు వాగు పరిసరాలకు వెళ్లారు. అక్కడ వాగులో హైవే నిర్మాణం కోసం తీసిన గుంతలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు పిల్లలను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎస్సై రామారావు, రెస్క్యూ సిబ్బందితో కలిసి ట్రైనీ ఐపీఎస్ మౌనిక ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో నీటి లోతు తెలుసుకొని పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటల తరువాత మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలంలో తమ పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు.