పెద్దపల్లి, మార్చి 11(నమస్తే తెలంగాణ): తమ ఇండ్లు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ‘ప్రభుత్వానికి మా మీద చిన్నచూపెందుకు’? అనే ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని చందపల్లి, కూనారం రోడ్లల్లో 484 ఇండ్లను నిర్మించి, డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేసిందని చెప్పారు.
కొన్ని మరమ్మతుల కారణంగా ఇప్పటివరకు ఇండ్లను అప్పగించలేదని, కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో తమను కాదని కొత్తవారిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. అదే జరిగితే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం తమ ఇండ్లు తమకే ఇవ్వాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వేళ గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.