బయ్యారం, ఫిబ్రవరి 18: ఏటీఎంను ధ్వంసం చేసి నగదును ఆపహరించిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్నది. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్ 930పీ) పకన ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దొంగలు పగులగొట్టి, అందులో ఉన్న రూ.29.7 లక్షల నగదును అపహరించారు. ఆదివారం ఉదయం డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన వారు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
మహబూబాబాద్ ఏఎస్పీ చెన్నయ్య, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై ఉపేందర్తోపాటు క్లూస్ టీం వేలుముద్రలు, ఆనవాళ్లు సేకరించారు. దుండగులు ఆరుగురు తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో నల్ల కారులో వచ్చి రెక్కీ నిర్వహించారని, అనంతరం ఏటీఎం కేంద్రంలోకి చొరబడి గ్యాస్ కట్టర్తో మెషిన్ను పగులగొట్టి గంట వ్యవధిలోనే చోరీ పూర్తి చేసినట్టుగా పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దొంగతనాల్లో ఆరితేరిన గ్యాంగే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని, ఆధారాలను సేకరించామని, త్వరలో పట్టుకుంటామని వారు తెలిపారు.