హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) అత్యంత కీలకం. ఇదిప్పుడు అధ్యాపకులు, సిబ్బంది లేమీతో వెలవెలబోతున్నది. ఇంతకాలం డిప్యుటేషన్లు, ఆన్డ్యూటీలతో ఎస్సీఆర్టీని నెట్టుకురాగా, తాజాగా వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో గుణాత్మక మార్పులకు దోహదపడే ఈ విభాగం ఖాళీగా దర్శనమిస్తున్నది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎస్సీఈఆర్టీలో ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ పై పనిచేస్తున్న 10 మందిపై, ఆన్డ్యూటీపై పనిచేస్తున్న మరో 16 మందిపై, డిప్యూటేషనపై పనిచేస్తున్న మరో ఇద్దరిపై ప్రభుత్వం వేటువేసింది. మొత్తం 28 మంది సిబ్బంది డిప్యుటేషన్లు, ఓడీలను రద్దు చేసి, వారి వారి సొంత పోస్టింగ్ స్థానాలకు పంపించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
మిగిలిన 15 మందిలోపు సిబ్బంది
ఎస్సీఈఆర్టీలో మొత్తం 10 విభాగాలున్నాయి. ఈ విభాగాల్లో ప్రొఫెసర్, లెక్చరర్, ప్రోగ్రాం ఆఫీసర్ వంటి 20కి పైగా పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో ప్రభుత్వ బీఈడీ కాలేజీలు, డైట్ కాలేజీల్లో విధులు నిర్వర్తించిన సిబ్బందిని ఎస్సీఈఆర్టీలో పనిచేయించుకొనే సంప్రదాయం ఏండ్లుగా కొనసాగుతున్నది. అయితే బీఈడీ, డైట్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, లెక్చరర్లు పదవీ విరమణలు పొందగా, వాటిల్లో పనిచేసేందుకే సిబ్బంది కరువయ్యారు. దీంతో టీచర్లను డిప్యుటేషన్పై తీసుకొచ్చి వారి సేవలను ఎస్సీఈఆర్టీలో వినియోగించుకొంటున్నారు. తాజా డిప్యూటేషన్ల రద్దుతో పదిమందిలోపే సిబ్బంది ఎస్సీఈఆర్టీలో మిగిలారు. ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక లెక్చరర్, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక సైన్స్ అసిస్టెంట్, ఒక గైడెన్స్ అండ్ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ఒక టీచర్ మాత్రమే పనిచేస్తున్నారు. ఇక రెండేండ్లలోపు డిప్యుటేషన్పై ఉన్న వారు మరో ఆరుగురున్నారు. మొత్తం పది విభాగాల్లో ఐదు విభాగాలు ఇప్పటికే ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు.
మళ్లీ డిప్యుటేషన్పై రావాల్సిందే..
ఎస్సీఆర్టీ ఖాళీ కాగా, దీని ప్రభావం కరికులం రూపకల్పన, టెట్, పదో తరగతి ప్రశ్నపత్రాల రూపకల్పనపై పడనున్నది. ఇప్పటికే ఆసర్, న్యాస్ సర్వేలో రాష్ట్రం వెనుకబడి ఉన్నది. విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయి. తాజాగా డిప్యుటేషన్లు రద్దుచేసినా, మళ్లీ కొత్త డిప్యుటేషన్లతో ఎస్సీఈఆర్టీని నింపాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ఎస్సీఈఆర్టీ కార్యకలాపాలు ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఇందుకు నోటిఫికేషన్ ఇచ్చి, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వీలైతే పరీక్షను నిర్వహించి, ప్రతిభ ఆధారంగా డిప్యుటేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.