Telangana Cabinet | జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు నాలుగు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
1. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) GHMC లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పెద్ద అంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్ కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట, బండ్లగూడ జాగీర్, మీర్పేట, బోడుప్పల్, నిజాంపేట, ఫిర్జాదిగూడ, జవహర్నగర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారు.
2. రాష్ట్రంలో ఇప్పుడున్న NPDCL, SPDCL రెండు డిస్కమ్లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి.
3. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలను కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలించింది. పునరుత్పాదక విద్యుత్తు వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఐదేండ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.
4. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఐదేండ్ల కాల పరిమితితోనే ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కమ్ల వద్ద ఉన్న ఎంవోయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ ను ముందుగా మన డిస్కమ్ లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.
5. రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్ను తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించి ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది.
6. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాల్వంచ, మక్తల్ లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఎన్టీపీసీకి ఈ యూనిట్ నిర్మాణం అప్పగిస్తే ఎంత విద్యుత్ యూనిట్ రేట్ పడుతుంది.. జెన్ కో ద్వారా చేపడితే ఎంత రేట్ పడుతుందో.. ముందుగా అంచనాలు వేసుకొని తుది పరిశీలన చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
7. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగుళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం GHMC పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14 వేల 725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని.. ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్ వైర్లన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది.
8. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
9. ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
10. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీ లతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.