హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సర్కారు ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింది. విద్యుత్ ఉత్పాదన, కొనుగోలుకు ప్రభుత్వం వెచ్చించే వ్యయం తగ్గింది. స్థానిక సంస్థల్లో ఎల్ఈడీ లైట్ల వినియోగంతో ఇలా రెండు రకాల ఫలితాన్ని ఇచ్చింది. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు 2016 నుంచి ఎల్ఈడీ లైట్లను వీధుల్లో ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎనిమిదేండ్లలో 14.82 లక్షల ఎల్ఈడీ లైట్లను అమర్చారు. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.1,864 కోట్లు ఆదా అయ్యాయని తేల్చారు. 2663 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. ప్రభుత్వ లక్ష్యం ఫలితాలను ఇచ్చింది.
ఎనిమిదేండ్లలో ఏడాదికి సగటున 200 కోట్లకుపైగా ప్రభుత్వ నిధులు ఆదా అయ్యాయి. అదే సమయంలో ప్రతి సంవత్సరం 300 మిలియన్ యూనిట్ల విద్యుత్ కూడా ఆదా అయినట్టు తేలింది. స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ఎల్ఈడీ లైట్లు వాడటం ద్వారా ప్రజలందరూ తమ ఇండ్లలోనూ విద్యుత్తు ఆదా చేయడానికి ఎల్ఈడీ లైట్లను వాడాలనే ఆలోచన వచ్చింది. ఎల్ఈడీ లైట్ల జీవితకాలం ఎక్కువ ఉండటం, వేడి ఎక్కువగా రాకపోవడం, యూవీ ఉద్గారాలు ఉండకపోవడం, తక్కువ వోల్టేజీలోనూ ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రభుత్వమే వాడటం ద్వారా ఎల్ఈడీ లైట్ల నాణ్యత, విద్యుత్ ఆదాపై వారికి ఎలాంటి సందేహాలు రాకుండా వాడగలిగారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎల్ఈడీ లైట్ల వాడకం విజయవంతమైంది. దీంతో ప్రజలకు మెరుగైన విద్యుత్తు వీధి దీపాల రూపంలో అందించారు. వీధుల్లో వాహనదారులు, పాదచారులకు ప్రకాశంతవంతమైన వెలుగులనునిచ్చింది.