నీటికి నడక నేర్పితే కరువు నేలసైతం పచ్చటి మాగాణమే! వర్షపు నీటిని ఒడిసిపట్టి చెరువులు నింపి పొలాలకు తరలిస్తే మడి మడిలోనూ వరిసిరులే. నది నుంచి కాలువలకు అక్కడి నుంచి చెరువులు నింపుతూ చివరి ఆయకట్టును జలసిరి తడిపితే భూతల్లికి పచ్చాని రంగేసినట్టు ఎటుచూసినా పైరులే. సాగునీటి ప్రాజెక్టులైనా, చెరువుల మరమ్మతులైనా, చెక్డ్యామ్లైనా అపర భగీరథుడు సీఎం కేసీఆర్ దార్శనికతకు నేడు యాసంగిలో పోటెత్తిన వడ్లు సజీవసాక్ష్యం. రాష్ట్ర రైతులు ధనికులుగా మారుతారన్న సీఎం కేసీఆర్ నమ్మకానికి నిదర్శనం.. ఈ వడ్ల విప్లవం. ఈ యాసంగిలో నల్లగొండ జిల్లా 6.68 లక్షల టన్నుల కొనుగోళ్లతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
నల్లగొండ ప్రతినిధి, మే 26 (నమస్తే తెలంగాణ): ఓ వైపు గోదావరి, మరోవైపు కృష్ణా, ఇంకో వైపు వర్షం నీటిని ఒడిసిపట్టిన మిషన్కాకతీయ చెరువుల ద్వారా అందివచ్చిన సాగునీటితో ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో రికార్డుస్థాయిలో వరి దిగుబడులు వచ్చాయి. సుమారు 24 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. సన్నరకాలు, రైతుల అవసరాలకు పోగా 18.46 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని జిల్లా అధికార యంత్రాంగం లెక్కలు వేశాయి. మద్దతు ధర ఏర్పడిననాటి నుంచి ఈసారి కొనుగోళ్లే అత్యధికం.
బుధవారంనాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.2,650 కోట్ల విలువైన 14,37,132 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగడం విశేషం. నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 6.68 లక్షల టన్నులు, సూర్యాపేట 4.97లక్షల టన్నులు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2.71 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత ఏడాది యాసంగితో పోలిస్తే ఇప్పటికే 75 వేల టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేశారు. మరో మూడు లక్షల టన్నుల వరకు మార్కెట్లలో ఉంటుందని సమాచారం. దీన్ని కూడా వచ్చే పది రోజుల్లో దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
గత యాసంగి కొనుగోళ్లలో నల్లగొండలో 6.49 లక్షల టన్నులు, సూర్యాపేటలో 3.94 లక్షల టన్నులు, యాదాద్రిలో 3.18 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ఏడాది గత కొనుగోళ్లను నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు అధిగమించాయి. బుధవారం నాటికే నల్లగొండలో 19 వేల టన్నులు, సూర్యాపేటలో 1.03 లక్షల టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేశారు. మొత్తం 89,821 మంది రైతుల నుంచి రూ.1,236.32 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 26,740 లారీ లోడ్లతో ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. అందుకోసం 1.67 కోట్ల గన్నీ బ్యాగులను వినియోగించారు. నల్లగొండ తర్వాత నిజామాబాద్ జిల్లా 6.47లక్షల కొనుగోళ్లతో రెండోస్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నల్లగొండ, నిజామాబాద్ నిలిచాయి.
ఓ వైపు భారీగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా అదేస్థాయిలో సీఎంఆర్ కూడా వేగవంతమైతే ధాన్యం దిగుమతులకు స్థల సమస్య ఉండదు. కానీ ఈసారి సీఎంఆర్ను తీసుకోవాల్సిన ఎఫ్సీఐ తీవ్రజాప్యం చేయడంతో ధాన్యాన్ని బియ్యంగా మరపట్టినా తరలించడం ఇబ్బందిగా మారింది. అందువల్ల రైస్మిల్లుల్లో స్థల సమస్య ఏర్పడింది. లారీలు మిల్లుల వద్ద వేచిచూడాల్సి వస్తున్నది. ఎఫ్సీఐ ఎప్పటికప్పుడు సీఎంఆర్ను సేకరిస్తే ఈ సమస్య వచ్చేది కాదు. దీంతో అధికారులు ప్రైవేటు గోదాంలు, మార్కెట్యార్డుల్లోని స్థలాల్లోనే ధాన్యం నిల్వచేశారు. రైస్మిల్లుల్లోని సీఎంఆర్ బియ్యం ఎగుమతి చేశాక ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సి వస్తున్నది.
ఉద్యమ ఆకాంక్షల్లో ఒకటైన సాగునీటితోనే ఇంతటి దిగుబడులు సాధ్యమయ్యాయి. కృష్ణా, గోదావరి, మూసీ నీటిని వినియోగించుకోవడంతో పాటు చెరువులను పునరుద్ధ్దరించడంతో ప్రతి ఎకరాకు సాగునీటి సౌలభ్యం ఏర్పడింది. దీంతో ఎన్నడూ లేనంత ధాన్యం నల్లగొండ జిల్లాలో పండింది. ఎఫ్సీఐ రూపంలో కేంద్రం కొర్రీలు పెట్టినా, రైతులు ఇబ్బంది పడొద్దని ప్రణాళికబద్ధ్దంగా వ్యవహరించాం. అందువల్లనే రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం. ఉమ్మడిజిల్లాలో రూ.2,650 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు సరికొత్త చరిత్ర. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. వ్యవసాయం పట్ల, రైతుల పట్ల చిత్తశుద్ధి కలిగిన దేశంలోనే ఏకైక సీఎం కేసీఆర్ అంటే అతిశయోక్తి కాదు.
-జగదీశ్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి
ధాన్యం కొనుగోళ్లల్లో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వంగా ఉంది. 2002లో ఎంఎస్పీ ఏర్పడితే అప్పటి నుంచి కూడా ఈ యాసంగిలో కొనుగోలు చేసిన 6.68 లక్షల టన్నుల కొనుగోళ్లే అత్యధికం. ఇది ఆల్టైం హై రికార్డు. మార్కెట్లో ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. సీఎంఆర్ ఆలస్యంతో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వకు ప్రైవేటు గోదాంలను వినియోగిస్తున్నాం. కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అన్నిశాఖలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నాం.
–వనమాల చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, నల్లగొండ.