హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చదువరుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పౌర పఠన మందిరాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే 9 ప్రారంభం కాగా, మరో 264 ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 20న విద్యాదినోత్సవం సందర్భంగా వీటిని ప్రారంభించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సహకారం అందించే ఉద్దేశంతో పౌర పఠన మందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 20న ప్రారంభించనున్న వాటికి అదనంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 542 పఠన మందిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉచితంగా సమకూరుస్తాయి.భవనం మరమ్మతులకు రూ.లక్ష, ఫర్నిచర్కు రూ. 40 వేలు, పోటీ పరీక్షల పరీక్షల పుస్తకాల కొనుగోలుకు రూ.10వేలు ఇస్తారు. వీటి నిర్వహణకు ప్రతి నెలా రూ. 2 వేల చొప్పున మంజూరుచేస్తారు. ఈ మొత్తంలో వెయ్యి రూపాయలను ఉద్యోగికి గౌరవ వేతనంగా అందిస్తారు. మరో రూ. వెయ్యిని దినపత్రికల కొనుగోలుకు వెచ్చిస్తారు.