Congress Govt | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం కొనసాగిస్తూనే ఉన్నది. ఆర్బీఐ నుంచి తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ ప్రకటించింది. 21 ఏండ్లకాల పరిమితికి 6.86 శాతం వార్షిక వడ్డీతో రూ.800 కోట్లు, 22 ఏండ్ల కాల పరిమితికి 6.86 శాతం వార్షిక వడ్డీతో రూ.900 కోట్లు, 25 ఏండ్ల కాలపరిమితికి 6.85 శాతం వార్షిక వడ్డీతో మరో రూ.900 కోట్లు సమీకరించింది.
2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి రేవంత్ సర్కారు ప్రతిపాదనలు పంపించింది. ఏప్రిల్లో మూడు దఫాల్లో రూ.4,400 కోట్లు తీసుకున్నది. రెండో నెల మే 6న రూ.2,000 కోట్లు, 13న మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు. నెలన్నరలోనే ఒక్క ఆర్బీఐ నుంచే రూ.9 వేల కోట్లు తీసుకున్నారు.