హైదరాబాద్: బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఖమ్మంలో నభూతోనభవిష్యత్ అనిపించేలా నిర్వహిస్తున్న ఈ సభకు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా పొరుగురాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఖమ్మం బయలుదేరారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు నుంచి 250 కార్లలో పయణమయ్యారు.
ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది. కేసీఆర్ ఇక్కడి నుంచే జాతికి తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అందుకోసం ఖమ్మం సర్వసన్నద్ధమైంది. ఎటు చూసినా నగరమంతా గులాబీమయమైంది. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత కరీంనగర్లో నిర్వహించిన తొలి బహిరంగ సభకు జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ను ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. నేడు ఖమ్మం సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను, ఒక మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సహా పలువురు జాతీయ నేతలను సీఎం కేసీఆర్ ఖమ్మం బహిరంగసభకు ఆహ్వానించారు.
ఖమ్మం బీఆర్ఎస్ సభకు దాదాపు 13 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చేందుకు లక్షలాది మంది జనం పయనమయ్యారు. ఖమ్మం జిల్లాలోని పాలే రు, వైరా, మధిర, ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి కూడా లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సభా ప్రాంగణంలో కోలాహలం నెలకొన్నది. ఉదయం నుంచే పార్టీ కార్యక్తలు సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. పలువురు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు.