ఎల్కతుర్తి, ఏప్రిల్ 10: ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, యాసం గి పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డి మాండ్ చేశారు. రైతు సంఘాల ఆహ్వానం మేరకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో ఎండిన వరి పంటలను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు అడిగి తెలుసుకొని వారిని ఓదార్చారు. దేవాదుల డీఈ వెంకటేశ్వర్లుతో ఫోన్లో మాట్లాడి దేవాదుల నార్త్ కెనాల్ ద్వారా నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆరా తీశారు. వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి తెచ్చిన కరువని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం మెడలు వంచైనా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.