Unemployment | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) (స్పెషల్ టాస్క్ బ్యూరో) : ఉద్యోగాల కోసం దేశంలో కోట్లాది మంది యువత పడిగాపులు కాస్తున్నారు. గడిచిన రెండేండ్లలో చూడని స్థాయిలో నిరుద్యోగిత పెరిగిపోయిందని సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఇవేమీ పట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 25 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ.. భర్తీ ప్రక్రియను చేపట్టకుండా వేడుక చూస్తున్నది. ఈ మేరకు ‘పే అండ్ అలవెన్స్’ పేరిట కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికను బట్టి తెలుస్తున్నది.
నాలుగింట్లో ఒకటి ఖాళీ
2004 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 12.1 శాతం పోస్టులు ఖాళీగా ఉంటే, 2014 మార్చి నాటికి ఇది 11.6 శాతానికి పెరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ ప్రక్రియ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఖాళీల సంఖ్య మరింతగా పెరిగిపోయింది. 2022 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వశాఖల్లో 24.3 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ‘పే అండ్ అలవెన్స్’ నివేదిక వెల్లడించింది. దేశ జనాభాను బట్టి ప్రభుత్వశాఖల్లో ప్రస్తుత ఉద్యోగుల సంఖ్యకు కనీసం ఐదారు రెట్లు ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నది. అయితే 39.77 లక్షల పోస్టులను మాత్రమే మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందులో 30.13 లక్షల కొలువులనే భర్తీ చేసింది. అంటే, ఇంకా 9.64 లక్షల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేంద్రం పర్మినెంట్ ఉద్యోగాలను కూడా ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగులతో తాత్కాలికంగా నడిపిస్తుండ టంతో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతున్నది.
‘ఆల్ ఈజ్ వెల్’ అంతేగా!
కేంద్ర ప్రభుత్వశాఖల్లో ఖాళీలు కొత్త శిఖరాన్ని అధిరోహించాయి. 2004లో ‘భారత్ వెలిగిపోతున్న’ సమయంలో (వాజ్పేయీ సర్కారు మారే నాటికి) కేంద్ర ప్రభుత్వశాఖల్లో ఖాళీలు 12.1 శాతంగా ఉన్నాయి. లోపభూయిష్ట విధానాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మన్మోహన్ సర్కార్ దిగిపోయే నాటికి (2014 మార్చిలో) ఖాళీలు 11 శాతంగా ఉన్నాయి. మోదీ ‘అచ్ఛేదిన్’ హయాంలో ఖాళీలు ఏకంగా 25 శాతానికి చేరాయి. అయినప్పటికీ, సబ్ చంగాసీ (అంతా మన మంచికే) అనుకోవాల్సిందేనా?! జైహింద్!!
– ట్విట్టర్లో ఐటీ మంత్రి కేటీఆర్ చురకలు