రేగోడ్, ఫిబ్రవరి 20: ఫుడ్పాయిజన్తో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఉదయం విద్యార్థినులు ఉప్మా తిన్నారు. ఆ తరువాత 25 మంది విద్యార్థినులు వాంతులు చేసుకోగా వెంటనే కేజీబీవీ ప్రత్యేకాధికారి స్వయంప్రభ మండల ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అందులో 10 మంది పరిస్థితి విషమించగా వారికి డాక్టర్ శ్వేత ప్రత్యేక చికిత్స చేయగా పరిస్థితి నిలకడగా ఉన్నది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డీఈవో విజయ, తహసీల్దార్ దత్తారెడ్డి, ఎంఈవో గురునాథ్ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకాధికారి స్వయంప్రభను వివరణ కోరగా మూడు నెలల నుంచి వాటర్ ఫిల్టర్ పనిచేయడం లేదని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతు చేయించలేదని తెలిపారు. వాటర్ ఫిల్టర్ బాగుంటే ఈ ఘటన జరిగేదికాదని పేర్కొన్నారు.
గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ; మూడో అంతస్తు నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని
బోనకల్లు, ఫిబ్రవరి 20 : ఇంటర్ వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రథమ సంవత్సరం విద్యార్థిని గురుకుల కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాలిలా.. ముదిగొండ మండలం మదాపురానికి చెందిన తుడుం సమీర బోనకల్లు గురుకులంలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నది. శుక్రవారం ఉదయం తరగతులు కొనసాగుతున్న సమయంలోనే సమీర టాయిలెట్కు వెళ్లొస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అయితే టాయిలెట్కు వెళ్లకుండా మూడో అంతస్తుకు వెళ్లి కిందకు దూకింది. శబ్దం రావడంతో పక్కనే రైతు వేదికలో శిక్షణ పొందుతున్న పంచాయతీ వార్డు సభ్యులు వచ్చి గమనించారు. ఇసుకలో కిందపడిన బాలికను పరిశీలించగా.. ఆమె చేయి, కాలు, నడుముకు తీవ్ర గాయాలు కావడంతో ద్విచక్ర వాహనంపై పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. మానసిక ఒత్తిడికి గురైనట్టు తోటి విద్యార్థులు తెలిపారు.