మెదక్ : మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆస్పత్రిలో 24 గంటల్లో 25 ప్రసవాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా గర్భిణుల కోసం ఎంసీహెచ్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ఎంసీహెచ్కే తరలివస్తున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు 24 గంటల్లోనే 25 ప్రసవాలు జరిగాయి. అందులో 12 సాధారణ ప్రసవాలు కాగా, 13 సిజేరియన్ చేశారు. 25 ప్రసవాల్లో 17 మంది మగ పిల్లలు, 8 మంది ఆడపిల్లలు జన్మించినట్లు తెలిపారు.
గైనకాలజిస్ట్ డాక్టర్ శివదయాల్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ వసుధ, అనస్థీషియా సాగరిక, పిల్లల వైద్య నిపుణులు చంద్రశేఖర్ రావు, స్టాప్ నర్సులు, నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్, వైద్యసిబ్బంది 24 గంటలు శ్రమించి కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రసవాలు చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆస్పత్రిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. గతంలో ఒక్కరోజులో 23 ప్రసవాలకు మించి జరగలేదని, ఒకే రోజు 25 ప్రసవాలు జరగడం ఆస్పత్రి రికార్డుగా పేర్కొన్నారు. ఏంసీహెచ్లో ఇదే ప్రథమం.