హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): మెగా డీఎస్సీ కింద 24 వేల టీచర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆదివారం ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రభుత్వం ఖాళీల విషయంలో అధికారులపై ఆధారపడకుండా మెగా డీఎస్సీ ప్రకటించక ముందే నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలతో చర్చించాలని, భర్తీ చేయాల్సిన ఖాళీ సంఖ్యను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యాశాఖ ద్వారా 5 వేల టీచర్ పోస్టులు భర్తీ అని ప్రకటించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పీఆర్సీ కమిటీ తన నివేదికలో రిపోర్టులో పేరొన్నదని, ఉపాధ్యాయ సంఘాలు కూడా అవే గణాంకాలు తెలుపుతున్నాయని గుర్తుచేశారు. 16 వేల మంది విద్యావలంటీర్లను రెండేండ్ల క్రితం నియమించారని, ఇప్పుడు కూడా 22 వేల మంది స్పెషల్ టీచర్ల నియామకానికి ఆర్థిక శాఖ 5 నెలల క్రితం ఆమోదం తెలిపిందని, ఖాళీలు లేకపోతే స్పెషల్ టీచర్లు ఎందుకని ప్రశ్నించారు. 10 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తే మరో 10 వేల పోస్టులు వస్తాయని తెలిపారు.