హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు భవనాలను నిర్మించే కాంట్రాక్టు పనులను చేజిక్కించుకోవడానికి 24 నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎనిమిది కొత్త వైద్య కళాశాలలకు రూ.930 కోట్లతో భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాలశాఖ మే 18 నుంచి టెండర్లను స్వీకరించింది.
టెండర్ల సాంకేతిక అర్హతను మూడు నాలుగు రోజుల్లో నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత వారం, పది రోజుల్లో ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేసి, ఎల్-1 కాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేస్తారు. అనంతరం ఎంపికైన కాంట్రాక్టర్ల జాబితాను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్కు పంపిస్తారు. అక్కడి నుంచి అప్రూవల్ లభించిన తరువాత రోడ్లు భవనాలశాఖ నుంచి లెటర్ అఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోఏ) ఇస్తారు. కాంట్రాక్టర్ ఒప్పందం కుదిరిన నాటి నుంచి 15 నెలల్లో మెడికల్ కాలేజీల భవనాలను నిర్మించి అప్పగించాల్సి ఉంటుంది.