Minister Sabitha Indra Reddy | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై ఆర్థికభారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంతో పాటు వర్క్బుక్స్, నోట్బుక్స్ కూడా ఉచితంగా అందజేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయమని కొనియాడారు. బుధవారం ఆమె సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ద్విభాషా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంతోపాటు ప్రాథమిక విద్యార్థులకు వర్క్బుక్స్, ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ను వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం పాఠ్యపుస్తకాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.132 కోట్లు ఖర్చు చేయగా, వచ్చే విద్యా సంవత్సరానికి రూ.200 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ఒక్కొక్క విద్యార్థికి రెండు జతల యూనిఫారాలు అందజేస్తామని చెప్పారు.
జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున బడిబాట కార్యక్రమం నిర్వహించి, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం అందజేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని చెప్పారు. పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించాలని సూచించారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలతోపాటు మాడల్స్కూళ్లు, కేజీబీవీలు, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్లల్లోని విద్యార్థులకు కూడా ఉచితంగా వర్క్బుక్స్, నోట్బుక్స్ అందజేయనున్నారు. సబ్జెక్టుకు ఒకటి చొప్పున నోటు పుస్తకాలను ఇవ్వాలని, వీటిని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ నుంచి ఇవ్వాలని భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా వర్క్బుక్స్, నోట్బుక్స్ను అందించడం చరిత్రాత్మకమని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాముక కమలాకర్, చీటి భూపతిరావు కొనియాడారు. ఇందుకు చొరవ చూపిన సీఎం కేసీఆర్, మంత్రి సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇది గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.