Telangana | 2011 డిసెంబర్:
హైదరాబాద్లోని నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి, జీడిమెట్ల తదితర పారిశ్రామిక వాడలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టారు. పరిశ్రమలకు రోజూ ఆరు గంటలు విద్యుత్ కోతలు విధించడంపై నిరసన ప్రదర్శన నిర్వహించారు.
2012 జూలై:
రాష్ట్రంలోని పరిశ్రమలకు నెలకు 12 రోజులపాటు పవర్ హాలిడే ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పైగా విద్యుత్ ఇచ్చే రోజుల్లోనూ సాయంత్రం 6:30 నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరాపై నియంత్రణ ఉంటుందని చెప్పింది. మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగు గంటలు, మున్సిపాలిటీల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామ పంచాయతీల పరిధిలో 12 గంటలపాటు విద్యుత్ కోతలు ఉంటాయని ప్రకటించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సరఫరా పరిస్థితికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు, సరఫరాకు మధ్య 20 శాతానికిపైగా లోటు ఉన్నదని ప్రభుత్వమే స్వయంగా పేర్కొన్నది. దీంతో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించి ఏకంగా పారిశ్రామిక విద్యుత్ వినియోగం 40 శాతం తగ్గించింది. ఇండ్లకు గంటలకొద్దీ కోతలు విధించింది. వ్యవసాయానికి మూడు నాలుగు విడతల్లో కలిపి ఏడు గంటల విద్యుత్ ఇస్తామని చెప్పింది. వాస్తవానికి తెలంగాణ ఏర్పడేనాటికి గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 5,661 మెగావాట్లు మాత్రమే. అప్పటికే ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు. అంటే డిమాండ్ కన్నా ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉన్నది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్ల గరిష్ఠ డిమాండ్లో 2,700 మెగావాట్ల మేర కొరత ఉండేది. ఇందుకు ప్రధాన కారణం విద్యుత్ సరఫరాపై దృష్టి సారించకపోవడం, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేకపోవడం.
ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగానే మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగు గంటలు, మున్సిపాలిటీల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామ పంచాయతీల పరిధిలో 12 గంటలపాటు విద్యుత్ కోతలు ఉంటాయని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఏ సమయంలో కరెంటు ఉంటుందో, ఎప్పుడు చీకటిలో మగ్గాల్సి వస్తుందో తెలియని దుస్థితి. దీంతో ప్రతి ఇంటికీ ఇన్వర్టర్, ప్రతి అపార్ట్మెంట్కూ ఒక డీజిల్ జనరేటర్ ఉండేది. గంటలపాటు ఈ జనరేటర్లు నడవడంతో అపార్ట్మెంట్ల సెల్లార్లన్నీ పొగచూరిపోయేవి. గంటలపాటు కరెంటు లేక దీపం వెలుగులో, ఉక్కపోతల మధ్య, దోమలు కరుస్తున్న దీనస్థితిలో బతకాల్సి వచ్చేది. మరోవైపు విద్యుత్ కోతల కారణంగా వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ప్రతి దుకాణం ముందు చిన్న జనరేటర్ ఉండేది. జనరేటర్లు అమ్మే ఏజెన్సీలు, వ్యాపారులకు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండేది.
సామాజికంగా ఎన్నో అనర్థాలు
విద్యుత్ కోతలు కేవలం ఉత్పాదక రంగాన్నో, వ్యవసాయ రంగాన్నో నష్టపరచలేదు. సామాజికంగా అనేక అనర్థాలకు కారణమయ్యింది. రైతుల మరణాలతో వేలాది కుటుంబాలు ఆగమయ్యాయి. అనేక మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు. వేలాది మంది పిల్లలు కుటుంబ పెద్దను కోల్పోయారు. పవర్ హాలిడేల కారణంగా అనేక భారీ, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పాదకత తగ్గడంతో కంపెనీలు సిబ్బంది సంఖ్యను తగ్గించాయి. వేలాది మంది ఉద్యోగులు, కార్మిక కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. వారి జీవన ప్రమాణాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. ఇండ్లకు కరెంటు బిల్లు కన్నా జనరేటర్ల డీజిల్ బిల్లులు, నాణ్యతలేని కరెంటు కారణంగా పరికరాలు చెడిపోయి రిపేర్ బిల్లులే ఎక్కువగా వచ్చేవి. కరెంటు లేక విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం కలిగేది. దీపాల వెలుగు సరిపోక లక్షలాది మందికి చూపు సమస్యలు వచ్చాయి.
రైతుల మరణాలు.. ఆత్మహత్యలు
రాష్ర్టానికి ఆయువు పట్టు వ్యవసాయ రంగం. తెలంగాణ ప్రాంతంలో బోర్లు, బావుల కింద సాగు తప్ప మరో మార్గం లేదు. అంటే విద్యుత్ ఉంటేనే వ్యవసాయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో సుమారు 19 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉండేవి. వీటి కింద కనీసం 40 నుంచి 50 లక్షల ఎకరాల భూమిని అప్పటి రైతన్నలు సాగుచేసేవారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఐదారు గంటలకు మించి సరఫరా కాలేదు. పగటిపూట 3 గంటల విద్యుత్తును మూణ్నాలుగు విడతలుగా ఇవ్వగా.. రాత్రిపూట మరో 3 గంటల విద్యుత్తును ఇంకో మూణ్నాలుగు దఫాలుగా ఇచ్చేవారు. పైగా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలిసేది కాదు. దీంతో తడిచిన మడే మళ్లీ మళ్లీ తడిచేది.. మిగతా పొలం, చేనంతా ఎండిపోయేది. రైతులు రాత్రుళ్లు పొలాల దగ్గరే ఉండేవారు. అదీగాక ఓవైపు పాములు, తేళ్లు, పురుగుల కాటుతో మరణించగా, చీకట్లో కనిపించక విద్యుత్ షాక్తో అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు.
నాణ్యత లేని కరెంటు కారణంగా మోటర్లు కాలిపోతూ ఉండేవి. ప్రతి గ్రామంలోనూ మోటర్లు వైండింగ్ చేసే దుకాణాలు బాగా ఉండేవి. మెకానిక్ల పని మూడు మోటర్లు.. ఆరు రిపేర్లు అన్నట్టుగా సాగేది. నెలలో కనీసం ఒక్కసారి అయినా మోటరు కాలిపోవడం.. బాగు చేయించి మళ్లీ బిగించడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చేది. చివరికి సగానికిపైగా పొలం ఎండిపోయి సింహభాగం దిగుబడి తగ్గిపోయేది. ధాన్యం అమ్మగా వచ్చిన మొత్తం కూలీలు, యంత్రాలకే సరిపోయేది. పంట పెట్టుబడి, మోటర్ల మరమ్మతులకు పెట్టిన ఖర్చు వెనక్కి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకునేవారు. విద్యుత్ షాక్, పాములు, తేళ్లు వంటి పురుగు కాట్లు, అప్పుల బాధతో ఆత్మహత్యలు.. ఇలా రైతు మరణాలు లేని రోజు గడవలేదన్న మాట సత్యదూరం కాదు. ఈ పరిణామాలతో అసలు వ్యవసాయం చేయడమంటేనే దండుగ అనే దుస్థితికి వచ్చింది. అనవసరంగా అప్పుల పాలు అవ్వడం ఎందుకని ఆలోచించి.. బీళ్లుగా వదిలేసిన భూములు లక్షల ఎకరాలు ఉండేవి. పదుల ఎకరాలు ఉన్న ఆసామి కూడా పట్టణాలకు వలస పోయి కూలీ పనులు చేసుకున్న దుస్థితి. అన్నదాతలు అపార్ట్మెంట్ల ముందు వాచ్మెన్లుగా పనిచేసేవారు. ఇక పొలాల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే.. దాని పరిధిలో ఉన్న రైతులందరూ మోటర్ల లెక్కన డబ్బులు జమ చేసుకొని మెకానిక్లను తీసుకొచ్చి.. ట్రాన్స్ఫార్మర్ను విప్పి సొంత ఖర్చులతో వాహనంలో విద్యుత్తు శాఖ రిపేరు సెంటర్కు తరలించేవారు. అక్కడ కూడా బారులు తీరిన ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ కోసం వచ్చినవి కనపడేవి. చివరికి ఎమ్మెల్యేతోనో, మంత్రితోనే రికమండేషన్ చేయిస్తే గానీ.. మూడునాలుగు రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయ్యేది కాదు. అది తీసుకొచ్చి తిరిగి బిగించుకునే బాధ్యత కూడా రైతులపైనే ఉండేది. ఇదంతా రైతులకు అదనపు భారంగా పరిణమించేది. కొన్నిసార్లు లైన్లు కాలిపోతే, ఫ్యూజ్లు పోతే.. తప్పనిసరిగా రైతులే హెల్పర్ల అవతారం ఎత్తి ట్రాన్స్ఫార్మర్ల వద్ద రిపేర్లకు దిగేవారు.. అవగాహన లేమితో రిపేర్లు చేయబోయిన అమాయకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు.
సరిపోని సరఫరా వ్యవస్థ
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాలవారికి సరిపోయేలా, సమయానుసారంగా విద్యుత్తును అందించడమనేది గగనంగా ఉండేది. సరిపోయినన్ని సబ్స్టేషన్లు లేకపోవడమే ఇందుకు కారణం. 400 కేవీ సబ్స్టేషన్లు ఆరు మాత్రమే ఉండేవి. 22 కేవీ సబ్స్టేషన్లు 51, 132 కేవీ సబ్స్టేషన్లు 176, 33 కేవీ సబ్స్టేషన్లు కేవలం 2,138 ఉండేవి. ఇక ఈహెచ్టీ లైన్ల పొడవు కేవలం 16,379 సర్క్యూట్ కిలోమీటర్లు మాత్రమే. ఇతర లైన్ల పొడవు (33 కేవీ, 11 కేవీ, ఎల్టీ కలిపి) 4.89 లక్షల కి.మీ పొడవు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో 3,272 పీటీఆర్లు (పవర్ ట్రాన్స్ఫార్మర్లు) మాత్రమే ఉండేవి. డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు కూడా అతి తక్కువగా 4.67 లక్షలు మాత్రమే ఉండేవి. ఇవి ఏమాత్రం సరిపోయేవి కావు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉండే విద్యుత్తు డిమాండ్కు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి, పేలిపోతూ ఉండేవి. ఎవరైనా కొత్తగా కనెక్షన్ తీసుకోవాలన్నా కష్టంగా ఉండేది. దరఖాస్తు కూడా తీసుకునేవారు కాదు. దొడ్డిదారిలో కనెక్షన్ తీసుకోవడం ఒక్కటే మార్గంగా ఉండేది. ప్రభుత్వానికి కట్టే చలాన్ కంటే రెట్టింపునకుపైగా ఖర్చు అయ్యేది. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సరఫరా మెరుగుపరచడంపై దృష్టి పెట్టలేదు. దీంతో విద్యుత్ కోతలు అనివార్యం అయ్యాయి.
సీఎం కేసీఆర్ కల.. వ్యవసాయానికి 24 గంటలు
వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్తును అందించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కల. ‘దేశానికి అన్నం పెడుతున్న రైతుకు ఉచిత విద్యుత్తును అందివ్వడమనేది ప్రభుత్వాల బాధ్యత. ఉచిత నాణ్యమైన విద్యుత్తు కోసం రైతులకు పెట్టే ఖర్చును ప్రభుత్వం ఎప్పుడూ భారంగా పరిగణించకూడదు’ అని చెప్పేవారు. వ్యవస్థలను బలోపేతం చేసుకుని, స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని పెంచిన తర్వాత.. వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ప్రయోగాన్ని మూడు జిల్లాల్లో మొదలుపెట్టారు. 2017, జూలై 16న ఉమ్మడి మెదక్ జిల్లాలో, అదే నెల 18న నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో 24 గంటల విద్యుత్తు సరఫరాను ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలు కొట్టిన మరుక్షణంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అభినందనలు తెలుపుకొన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరాను మొదలుపెట్టారు. ఆ సరఫరాను దాదాపు ఆరేండ్లుగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో వినియోగమయ్యే విద్యుత్తులో ఇప్పుడు 33 శాతం వ్యవసాయానికే ఖర్చవుతున్నది.
2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రాష్ట్రంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. పైగా తెలంగాణ అంధకారం అవుతుందన్న అవమానాలు. ఏ రంగాన్ని చూసినా కరెంటు కోతలు. దీంతో రాష్ర్టాన్ని గాడిలో పెట్టాలంటే విద్యుత్ రంగాన్ని సంస్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటి సమీక్షా సమావేశం విద్యుత్తుపైనే నిర్వహించారు. స్వల్ప, దీర్ఘ, మధ్యకాలిక లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పరిశ్రమల రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించగలిగారు. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్తును అందించారు. 2018, జనవరి 1 నుంచి దేశం యావత్తు ఆశ్చర్యపడేలా వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా, ఉచిత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశారు. అనంతరం స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. ఫలితంగా అసలు విద్యుత్తు కోతలు అనే పదాన్నే ప్రజలు మర్చిపోయారు.
సామాజికంగా ఎన్నో ప్రయోజనాలు
అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు ఫలితంగా సామాజికంగా అనేక మార్పులు వచ్చాయి. రైతులు తమకు ఇష్టం వచ్చినప్పుడు బోరుబావుల వద్ద మోటర్ స్టార్టర్ల స్విచ్ వేసుకుంటున్నారు. ఉత్పాదకత పెరిగింది. మరోవైపు ప్రాజెక్టుల నుంచి నీళ్లు రావడంతో దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా మారింది. 60 లక్షలకుపైగా రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల మోత లేదు. కిరోసిన్ దీపాలు మాయమయ్యాయి. పరిశ్రమలకు 24 గంటల కరెంటుతో ఉత్పాదకత పెరిగింది. కొత్త పరిశ్రమలు వెల్లువలా తరలివస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఐటీ రంగంలో దేశంలోనే అత్యధిక ఎగుమతులు, ఉద్యోగాల కల్పనతో తెలంగాణ దూసుకెళ్తున్నది.
ఉత్పత్తి.. వినియోగం పెరిగింది
రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. తొమ్మిదిన్నరేండ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా సాధించింది తెలంగాణ. కేటీపీపీ నుంచి 600 మెగావాట్లు, 240 మెగావాట్లు లోయర్ జూరాల, 120 మెగావాట్లు పులిచింతల, 800 మెగావాట్లు కేటీపీఎస్ (స్టేజ్-7), 1,080 మెగావాట్లు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, 1,200 మెగావాట్లు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, 1,000 మెగావాట్లు ఛత్తీస్గఢ్ నుంచి, 6,106 మెగావాట్లు సౌర విద్యుత్తు, 128 మెగావాట్లు పవన విద్యుత్తు తదితరాలన్నింటితో కలిపి నేడు 19,464 మెగావాట్లకు (గత అక్టోబర్ 1 నాటికి) స్థాపిత సామర్థ్యం చేరుకున్నది. మరో 8,485 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో ప్రతిష్టాత్మకంగా దామరచెర్లలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం ఉన్నది. ఎన్టీపీసీ రామగుండంలో 1,600 మెగావాట్లు కూడా ఉన్నాయి. విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ దూసుకెళుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 128 మిలియన్ యూనిట్ల వినియోగం 2014, జూన్ 6 నాటికి జరగ్గా.. 2023, మార్చి 14 నాటికి ఏకంగా 297.89 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఇది కూడా ఒక రికార్డు. ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందుతున్నది అనడానికి కొలమానంగా తలసరి విద్యుత్తు వినియోగాన్ని చూస్తారు. రాష్ట్రం వచ్చేనాటికి ఇది కేవలం 1,196 యూనిట్లు మాత్రమే. 2021-22 సంవత్సరంలో 2,126 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగం నమోదయ్యింది.
మళ్లీ ఆ రోజులు వస్తే..
అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా కారణంగా వెలుగు జిలుగులతో ఉన్న తెలంగాణలో, వ్యవసాయం దండుగన్న చోటే పండుగైన రోజుల నుంచి పాత రోజులకు వెళ్తే… అన్న ఊహనే భయంకరం. మళ్లీ తామొస్తున్నామంటూ బయలుదేరిన కాంగ్రెస్ నేతలను చూసి రైతాంగం వణికిపోతున్నది. అప్పటి అగచాట్లు మళ్లీ కావాలా.. అదే దుస్థితి రావాలా.. 24 గంటల నిరంతరాయ పూర్తి ఉచిత విద్యుత్తు స్థానంలో ఐదారు గంటలు.. ఆగుతూ.. ముక్కుతూ మూలుగుతూ.. కాలుతూ.. ట్రాన్స్ఫార్మర్లు పేలుతూ వచ్చే కరెంటును ఊహించుకుంటేనే వెన్నులో జలదరింపు మొదలవుతున్నది. అదే పరిస్థితి మరోసారి ఎదురైతే.. చేస్తున్న వ్యవసాయాన్ని వదిలిపెట్టి.. పొట్ట చేతపట్టుకుని బొంబాయి.. బొగ్గుబాయి.. దుబాయికి పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అని.. కలలో కూడా ఆ కరెంటు కష్టాలు జ్ఞాపకం రావద్దంటూ రైతులు పేర్కొంటున్నారు. తాము ప్రశాంతంగా ఉన్నామని, లాభాలను కండ్ల చూస్తున్నామని, పది మందికి ఉపాధి కల్పిస్తున్నామని, మళ్లీ పవర్ హాలిడేల రోజులు వద్దంటూ పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
రూ.40 వేల కోట్లతో బలోపేతం
అన్ని రంగాలకు నిరంతరాయ విద్యుత్తు కోసం మౌలిక వ్యవస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అధికారులకు స్వేచ్ఛను ఇచ్చారు. ట్రాన్స్మిషన్, డిస్కం సంస్థలు 24 గంటల విద్యుత్తును అందించేలా తీర్చిదిద్దడానికి రూ.40,470 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ట్రాన్స్కోలో అతిముఖ్యమైన 400 కేవీ, 220 కేవీ సబ్స్టేషన్లను పెంచారు. మొత్తం ఈహెచ్టీ లైన్ల పొడవును భారీగా పెంచారు. డిస్కంల పరిధిలో 33 కేవీ సబ్స్టేషన్లు, ఎల్టీ లైన్ల పొడవును పెంచారు. రైతులకు 24 గంటల విద్యుత్తు సరఫరాకు ఉన్న ప్రధాన అవరోధాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఒకటి. రాష్ట్రం రాకముందు ఈ ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్ శాతం 30 ఉంటే.. దీన్ని 7 శాతానికి తగ్గించగలిగారు. సుమారు 4.05 లక్షల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను అదనంగా చేర్చి, లో ఓల్టేజీని అరికట్టారు. పీటీఆర్ల సంఖ్యను 3,272 నుంచి 5,694కు పెంచడంతో.. ఫెయిల్యూర్ శాతం గణనీయంగా తగ్గింది. విద్యుత్తు స్థాపిత సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. నాణ్యమైన, నిరంతర సరఫరాతో ప్రజల వినియోగం పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 5,661 మెగావాట్ల (6.6.2014) గరిష్ఠ డిమాండ్ నమోదయ్యింది. అదికాస్తా 15,497 మెగావాట్లు (30.3.2023)కు చేరుకున్నది.
– కే.మహేందర్ రెడ్డి