Telangana Decade Celebrations | వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు.. సులభ వాణిజ్యంలో నం.1.. ఇదీ తెలంగాణ పారిశ్రామికం! ప్రపంచం దారిపట్టిన ఎర్రతివాచీ వనం!!
హైదరాబాద్: పరిశ్రమలు వర్ధిల్లాలి.. ఉపాధి పెరగాలి.. తెలంగాణ పచ్చబడాలి.. ఇదే మన ధ్యేయం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పుడూ చెప్తుంటారు. అన్నట్టుగానే ప్రపంచంలోనే నంబర్వన్ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణను 23 వేల పరిశ్రమలకు అడ్డాగా మార్చారు. ఈ పరిశ్రమల ద్వారా 17 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టి జరిగింది. ముఖ్యంగా ఐటీ, ఔషధాలు, ఆహార శుద్ధి, విమానయానం తదితర రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ దార్శనికతకుతోడు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అనేక దేశీయ, విదేశీ కంపెనీలు రాష్ర్టానికి క్యూ కడుతున్నాయి. 2015లో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐపాస్ చట్టాన్ని తీసుకురావటంతో ప్రపంచస్థాయి కంపెనీలు తెలంగాణవైపు చూడటం మొదలుపెట్టాయి.
పెట్టుబడులకు ఉన్న అడ్డంకులు తొలగి, సులభతర అనుమతులు లభించటంతో రాష్ట్ర పారిశ్రామిక రంగ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. పరిశ్రమలకు కావాల్సిన భూమి సిద్ధం చేయటం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించటం, స్నేహపూర్వక విధానాలు, మెరుగైన ప్రోత్సాహకాలతో తెలంగాణకు ఎదురు లేకుండా పోయింది. ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా వంటి నగరాలను కాదని తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.45 లక్షల ఎకరాలను పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటికే 28,000 ఎకరాల భూమిని వివిధ కంపెనీలకు కేటాయించారు. ఇందులో ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తదితర పారిశ్రామికవాడలు ముఖ్యమైనవి.
కేటీఆర్ ప్రత్యేక చొరవ
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, స్వయంగా రంగంలోకి దిగి కంపెనీలతో మాట్లాడుతుండటం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. దావోస్ ప్రపంచ వాణిజ్య వేదిక, అమెరికా, లండన్, తైవాన్ పర్యటనలు, బయో ఏషియా సదస్సు తదితర ప్రపంచ వేదికలపై తెలంగాణ పారిశ్రామిక విధానాలను వివరిస్తూ, విదేశీ కంపెనీలను సైతం ఇక్కడికి రప్పిస్తున్నారు. ఉదాహరణకు యాపిల్ కంపెనీకి ఫోన్లు తయారు చేస్తున్న ఫాక్స్కాన్.. రాష్ట్రంలో అతిపెద్ద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, యాపిల్, నోవార్టిస్ వంటి ఎంఎన్సీలు అమెరికా వెలుపల తమ రెండో అతి పెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటు చేయటంలో ఆయనది కీలక పాత్ర.
చైనాకు పోటీగా విమాన విడిభాగాల తయారీ
ఎయిరిండియా ఇటీవలే 470 విమానాల తయారీకి ఎయిర్బస్, బోయింగ్ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్తో తెలంగాణలో విమానయానరంగ పరిశ్రమ మరింత ఊపందుకోనున్నది. ఎందుకంటే టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా విమానాలు, హెలికాప్టర్ల బాడీలతోపాటు వివిధ విడిభాగాలను తయారు చేస్తున్నది. ఇటీవలే హైదరాబాద్లోని టీబీఏఎల్ నుంచి తొలి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్ను బోయింగ్ 737 విమానాల కోసం ఎగుమతి చేశారు. ఈ వర్టికల్ ఫిన్లు గతంలో చైనాలోని జియాన్ ఎయిర్క్రాఫ్ట్ పరిశ్రమ నుంచి సరఫరా అయ్యేవి. తాజాగా ఇవి హైదరాబాద్ కేంద్రంగా తయారవుతుండటం విశేషం.
వివిధ దేశాల కంపెనీలకు ప్రత్యేక క్లస్టర్లు
కొరియా, తైవాన్, ఫ్రాన్స్, కెనడా, యూకే, యూఎస్ తదితర దేశాలకు చెందిన అనేక కంపెనీలు రాష్ట్రంలో కొలువుదీరటంతో భూముల లభ్యత, కంపెనీల అవసరాలను బట్టి క్లస్టర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జహీరాబాద్లోని నిమ్జ్లో సుమారు 2000 ఎకరాల్లో కొరియా, తైవాన్, జపాన్ తదితర దేశాలకు ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అక్కడ ఎలక్ట్రానిక్స్, చిప్స్ డిజైనింగ్, క్లీన్రూమ్స్, కన్వేయర్స్ తదితర ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు ఏర్పాటు కానున్నాయి.
కంపెనీ పెట్టాలంటే హైదరాబాదే బెటర్
– ఓ పారిశ్రామిక వేత్త మాట
పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు తెలంగాణలోనే భేష్
– ఓ కంపెనీ సీఈవో మనోగతం
హెలికాప్టర్ బాడీ నుంచి కార్గో విమానాల వరకు..
విమానాల విడిభాగాలు, ఇంజిన్లు, హెలికాప్టర్ బాడీ తదితరాల తయారీ ద్వారా ఏరోస్పేస్ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ.. కార్గో విమానాల రూపకల్పన కేంద్రంగానూ ఎదిగింది. విమానాల తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్పిడి చేసేందుకు ఉద్దేశించిన కన్వర్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నది. దానికోసం ఉద్దేశించిన బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్(బీసీఎఫ్)ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు జీఎంఆర్తో ఒప్పందం చేసుకున్నది. శాఫ్రాన్, టాటా-బోయింగ్, జీఎంఆర్ తదితర సంస్థలు ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
ఉపాధి కల్పనే లక్ష్యం
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ పారిశ్రామిక రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ప్రపంచంలో ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అందుకే ప్రైవేటు రంగంలో ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేనివిధంగా పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రోత్సాహకాలు అమలుచేస్తున్నాం. ఐటీ, ఔషధ, ఈవీ, ఆహారశుద్ధి, ఆహార తయారీ, విమానయాన, రక్షణ తదితర రంగాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే విదేశీ కంపెనీలకు తెలంగాణ గేట్ వే ఆఫ్ ఇండియాగా మారింది. చైనాను వీడాలనుకుంటున్న సౌత్ ఏషియా, అమెరికా, యూరోప్ దేశాల కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ప్రపంచంలో వ్యాక్సిన్ క్యాపిటల్, ఔషధాల తయారీ కేంద్రంగా ఉన్న తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దిగ్గజ ఐటీ సంస్థలు తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. – కే తారకరామారావు, పరిశ్రమల శాఖ మంత్రి
వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో తిరుగులేని శక్తి
ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్ల లో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు, దేశం లో ఉత్పతయ్యే ఔషధాల్లో మూడింట ఒక వంతు ఔషధాలు తెలంగాణలోనే తయారవుతున్నాయి. దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఔషధాల్లో ఐదింట ఒక వంతు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. హైదరాబాద్ శివా రు సంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 14,029.36 ఎకరాల్లో ఫార్మాసిటీని ప్రభు త్వం ప్రతిపాదించింది. రూ.64,000 కోట్ల పెట్టుబడులు, 4.20 లక్షల ఉద్యోగావకాశా లు లభిస్తాయని అంచనా. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో 250 ఎకరాల్లో అధునాతన మెడికల్ డివైజెస్ పార్క్ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్దది ఇదే. గుండె ఆపరేషన్లలో వాడే అధునాతన స్టెంట్లు కూడా త యారవుతున్నాయి. కండ్లజోళ్లు, పలు ఇతర మెడికల్ ఉత్పత్తుల కంపెనీలు 50 వరకు ఇ క్కడ ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 5,465 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.
పరిశ్రమల కోసం ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన చర్యలు
తెలంగాణకు ప్రశంసలు
ఆహార శుద్ధి రంగంలో దూకుడు
ఆహారశుద్ధి రంగంలో తెలంగాణ పురోగతి సాధిస్తున్నది. 2017-21 మధ్యకాలం లో టీఎస్ఐపాస్ ద్వారా 2,140 యూనిట్ల కు అనుమతులు జారీచేయగా వాటి ద్వారా రూ.2,376.7 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత సంవత్సరంలో స్థిర మూలధనం రూ.10,000 కోట్లు దాటుతుందని అం చనా. ప్రభుత్వం 2021లో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లలో ఇప్పటికే 1,031 యూనిట్లకు 3,038 ఎకరాల భూ మి కేటాయించారు. ఇదికాకుండా, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో 3,966 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహించేందుకు 2021లో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం రూ.10 లక్షల మూలధన గ్రాంట్తో యూనిట్ల ఏర్పాటుకు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్లకు మద్దతు ఇస్తున్నది.
ముఖ్యమైన ఇండస్ట్రియల్ పార్కులు
ఫార్మాసిటీ: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత ఔషధ క్లస్టర్గా దీన్ని 14,029.36 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. రూ.64,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 4.20 లక్షలమందికి ఇందులో ఉపాధి లభిస్తుందని అంచనా. మొదటి దశ కింద 8,900 ఎకరాల్లో ఔషధ పార్క్ అభివృద్ధికి ప్లానింగ్ పూర్తయింది.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్: మల్టీ ప్రొడక్ట్ తయారీ జోన్ను ప్రతిపాదించారు. 12,635.14 ఎకరాల్లో నిమ్జ్ పథకం కింద మొదటి దశలో 3,909 ఎకరాలు కేటాయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.13,300 కోట్లు కాగా, రూ.60,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 2,77,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మాస్టర్ప్లాన్, ఈఎస్ఐఏ అధ్యయనం పూర్తయింది. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్
రావిర్యాల(ఈ-సిటీ), మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేశారు. ఇందులో రావిర్యాల క్లస్టర్ 603.52 ఎకరాల్లో, మహేశ్వరం క్లస్టర్ 310.70 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ-సిటీలో 48 కంపెనీలకు భూములు కేటాయించగా, వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.1,585 కోట్ల పెట్టుబడులు రాగా, వచ్చే ఏడాది మరో రూ.2,626.70 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. మహేశ్వరం క్లస్టర్లో 14 కంపెనీలకు భూములు కేటాయించగా, వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో రూ.472.89 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 5,216 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వచ్చే ఏడాది చివరికల్లా ఇందులో ఖాళీ జాగాను కూడా కంపెనీలకు కేటాయించనున్నారు.
ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ క్లస్టర్, ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నంలోని ఖాల్సా గ్రామంలో 123 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రతిపాదించారు. 43 కంపెనీలకు భూమి కేటాయింపు పూర్తయింది. రూ. 55.67 కోట్ల పెట్టుబడులు, 30,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే జూన్ నాటికి ఉత్పత్తులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.
చందన్వల్లి ఇండస్ట్రియల్ పార్క్
సంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చందన్వల్లి ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేశారు. ఇది మల్టీ ప్రొడక్ట్ ఇండస్ట్రియల్ పార్క్. 20,000 ఎకరాల్లో ప్రతిపాదించారు. అత్యుత్తమ కార్పెట్ టైల్స్ తయారీ సంస్థ వెల్స్పన్ ఫ్లోరింగ్, గ్రీన్ కార్పెట్స్, ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తులు ప్రారంభించాయి. పలు కంపెనీలకు కూడా భూములు కేటాయించగా, ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి.
సుల్తాన్పూర్ ఎఫ్టీసీసీఐ ఎఫ్ఎల్వో పార్క్
ఎఫ్టీసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్కు సుల్తాన్పూర్లో 50 ఎకరాలు కేటాయించారు. ఎంఎస్ఎంఈల గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటునకు 26 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యింది.
దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్
తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ (టీఐఎఫ్) భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 523 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేశారు. ఇందులో 621 కంపెనీలకు ఇప్పటికే భూములను కేటాయించగా, రూ.1,200 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 19,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
మెడికల్ డివైజెస్ పార్క్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్లో 250 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ను అభివృద్ధి చేశారు. ఇందులో 50 కంపెనీలు ఏర్పాటు కాగా, రూ.839 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5,465 మందికి ఉపాధి లభించింది.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్: 1,190 ఎకరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. రూ.11,586 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 1,13,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. గణేశా ఎకోస్పేర్, కిటెక్స్, యంగ్వన్ కార్పొరేషన్ తదితర జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే రూ.2,527 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటిద్వారా 22,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కంపెనీలు త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నది.
ఎగుమతుల్లో తెలంగాణ హవా
దేశం నుంచి అంతర్జాతీయ మార్కెట్కు జరుగుతున్న ఎగుమతుల్లో తెలంగాణ హవా కొనసాగుతున్నది. దేశం నుంచి జరుగుతున్న 75 శాతం ఎగుమతులు ఐదు రాష్ర్టాలనుంచే జరుగుతుండగా, అందులో తెలంగాణ కూడా ఒకటి. రాష్ట్రం నుంచి ఎక్కువగా ఔషధాలు, ఆర్గానిక్ కెమికల్స్ ఎగుమతి అవుతుండగా, అమెరికా, చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఎక్కువగా మన రాష్ట్రం నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సామాజిక, ఆర్థిక నివేదిక-2022 ప్రకారం, 2021-22లో తెలంగాణ నుంచి రూ. 2,65,510 కోట్ల విలువైన సరుకు, సేవలు అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి అయ్యాయి.