నిజామాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / బోధన్ : 22ఏ నిషేధిత జాబితాలో ఉమ్మడి నిజామాబాద్ సైతం చిక్కుకొని విలవిలలాడుతున్నది. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో ఈ సమస్య వెలుగు చూస్తున్నది. వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం, దాన్ని రహస్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతి చిన్న కార్యక్రమానికీ గ్రామాల్లో డప్పు చాటింపుతో అవగాహన కల్పించే యంత్రాంగం.. కీలక విషయాన్ని ఎందుకు గుట్టుగా వెబ్సైట్లో పెట్టేసి చేతులు దులుపుకొన్నదో అర్థం కావడం లేదు. చాలా మందికి తమ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయనే విషయం తెలియదు. అవసరాలకు తమ భూములను అమ్ముకోవడానికి సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లినప్పుడే అసలు విషయం బయటపడుతున్నది. తమ భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయో తెలియక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు.
బోధన్ పట్టణంలోని వేంకటేశ్వరనగర్, శక్కర్నగర్, ఆచన్పల్లి, రాకాసిపేట్, బెల్లాల్ రోడ్డులోని అనేక కాలనీల్లో వందలాది ఇండ్ల స్థలాలు, ఇండ్లను 22ఏ పరిధిలోకి తెచ్చారు. పట్టణంలోని పాండు తర్ఫా, బెల్లాల్ తర్ఫా, దౌత్యాల్ తర్ఫా పరిధిలోని అనేక కాలనీలు, ఇండ్ల స్థలాలు నిషేధిత జాబితాలో చేరాయని తెలిసి పట్టణ ప్రజలు హతాశులవుతున్నారు. జాబితా నుంచి తొలగించాలంటూ బోధన్ ప్రాంతంలోని యజమానులు అధికారులను ప్రాధేయపడుతూ తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. బోధన్ పట్టణం, చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాల పరిధిలో సుమారు 3,500 ఎకరాల భూములు 22ఏలో ఉన్నట్టు సమాచారం. బోధన్ పట్టణంలోని బెల్లాల్ రెడ్డులో 258 ఇండ్లు, ఇండ్ల స్థలాలు కలిగిన పోలీస్ కాలనీ యావత్తు 22ఏలో ఉండటం విస్తుగొలుపుతున్నది.
2000 సంవత్సరంలో ఈ కాలనీ భూమిని నిజాం షుగర్స్ నుంచి పోలీస్ హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ కొనుగోలు చేసింది. 4510/2000 నంబర్తో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ భూముల టైటిల్ ఇంత క్లియర్గా ఉండగా, ఈ కాలనీ మొత్తాన్ని 22ఏలో చేర్చడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఏ సాంకేతిక ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం తమ కాలనీని నిషేధిత జాబితాలో ఉంచిందంటూ ప్రశ్నిస్తున్నారు. బోధన్ పట్టణంలోని వేంకటేశ్వరనగర్ కాలనీ సైతం నిషేధిత భూముల పరిధిలో చూపించడం రాష్ట్ర ప్రభుత్వ అవివేక చర్యలకు నిదర్శనంగా నిలుస్తున్నది. 296 సర్వే నంబర్లో ఉన్న ఈ కాలనీలో సుమారు 400 ఇండ్లు, ఇండ్ల స్థలాలున్నాయి. చాలామంది ఇండ్లు, స్థలాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిసి కాలనీవాసులు లబోదిబోమంటూ అధికారులవద్దకు పరుగులుపెడుతున్నారు.

రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 22ఏ(1)(సీ) ని అనుసరించి దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాలను పొందుపర్చాలి. కానీ వీటికి సంబంధించిన సమాచారమే దొరుకడం లేదు. నిజామాబాద్ జిల్లాలో అనేక ఆలయాలకు రూ.కోట్లు విలువ చేసే వందలాది ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి. వాటి వివరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సేకరించింది. అన్యాక్రాంతం కాకుండా ఆలయాల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి రక్షించింది. వాటిని ఆక్రమణదారుల నుంచి తిరిగి దక్కించుకొని దేవుడి భూములను కాపాడింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో వక్ఫ్ భూములతో పాటు దేవాలయాల భూముల సమాచారం కూడా లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, అసైన్డ్, స్థానిక సంస్థల, వివాదాస్పద, కోర్టు కేసుల భూముల వివరాలన్నింటినీ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో పెట్టి సెక్షన్ 22ఏ(1)(సీ) పరిధిలోని భూముల సమాచారాన్ని ప్రజా బాహుళ్యంలో పెట్టకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఏదైనా కోర్టు ఆదేశాల మేరకు సమాచారం అందుబాటులో పెట్టకపోతే ఆ సమాచారాన్ని ప్రస్ఫుటంగా అందులో పేర్కొనాలి. అలాంటిదేమీ కనిపించడం లేదు. ‘అప్లోడింగ్ సూన్’ (Prohibition data is under review. it will be published soon) అంటూ రెడ్ మార్క్తో సూచిక వస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. దీనిపై వివరణ కోసం రెవెన్యూ, దేవాదాయ, రిజిస్ట్రేషన్ శాఖలను సంప్రదిస్తే ఒక్కో అధికారి ఒక్కోలా చెప్పిదాటవేయడం గమనార్హం.

కంఠేశ్వర్ దేవాలయ భూములకు సంబంధించి మాకు ఎలాంటి వివరాలు రాలే. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన వాటిని నిషేధిత జాబితాలో పొందుపర్చాం. పలు చోట్ల నిషేధిత జాబితాలో వివరాలు నమోదైన వాటికి రిజిస్ట్రేషన్ కోసం కొంత మంది వచ్చారు. వాటిని క్లారిఫికేషన్ కోసం జిల్లా రిజిస్ట్రార్కి రాశాం. డీఆర్ నుంచి కలెక్టర్కు అలాంటి ఫైళ్లను పంపించాం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆలయాల భూముల వివరాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలకు పంపించాం. వాటిని నిషేధిత జాబితాలో నమోదు చేసి భూములను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నం.
నాకు బోధన్ పట్టణంలోని పాండు తర్ఫా శివారులో 220 గజాల ఇంటి స్థలం ఉన్నది. 826/1, 827 సర్వే నంబర్లలో ఈ స్థలం ఉన్నది. ఇది పట్టా భూమి. 1954 నుంచి ఖాస్రా పహానీ రికార్డులు ఉన్నయి. ఇంత పక్కాగా ఉన్న నా ఇంటి స్థలాన్ని 22ఏ జాబితాలో పెట్టి నన్ను ఇబ్బందులు పెడుతున్నరు. సెప్టెంబర్ 14న నా బిడ్డ వివాహం నిశ్చయమైంది. బిడ్డ పెండ్లి కోసం ఆ స్థలాన్ని అమ్మి కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ కోసం చలానా కట్టి ఆగస్టు 17న స్లాట్ బుకింగ్ కూడా చేసిన. రిజిస్ట్రేషన్ కోసం బోధన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు పోతే.. ‘నీ స్థలం నిషేధిత జాబితాలో ఉన్నది’ అని రిజిస్ట్రేషన్కు సబ్ రిజిష్ర్టార్ నిరాకరించిండు. ఏంచేయాలో తెలుస్తలేదు. తన స్థలాన్ని 22ఏ నుంచి తొలగించాలని సోమవారం బోధన్ ఆర్డీవో ఆఫీస్, కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాలు ఇచ్చిన. మమ్నలి గోస పెడితే ఈ ప్రభుత్వానికి ఏమొస్తది?
నాకు బోధన్ గోశాల ఏరియాలో చిన్న ఇల్లున్నది. పాత బస్స్టాండ్ వద్ద అరటి పండ్లు అమ్ముకుంట కుటుంబాన్ని పోషించుకుంటున్న. వేరే ఆస్తిపాస్తులేం లేవు. నా కూతురు పెండ్లికి అక్కరకు వస్తదని పట్టణ శివారు నర్సాపూర్ సమీపంలోని వెంచర్లో వంద గజాల స్థలాన్ని కొన్న. ఆ స్థలం సర్వే నంబర్ 831. ఈ సర్వే నంబర్పై అక్కడ 5 ఎకరాల 31 గుంటల భూమి ఉన్నది. ఇందులో ప్రభుత్వ భూమి కేవలం 30 గుంటలు మాత్రమే ఉన్నది. మిగతా 5 ఎకరాల 1 గుంట భూమి ప్లాట్ల రూపంలో వివిధ వ్యక్తుల ఆధీనంలో ఉన్నది. సర్కార్ 22ఏ నిషేధిత భూముల్లో ఈ మొత్తం 831 సర్వే నంబర్ పెట్టింది.
అదే సర్వే నంబర్తో ఉన్న ఆ ఐదు ఎకరాల ఒక గుంట భూమిలోని ఇండ్ల స్థలాలన్నింటినీ 22ఏ జాబితాలో చేర్చింది. నా బిడ్డ పెండ్లి కోసం వంద గజాల స్థలాన్ని అమ్మి కొనుగోలుదారుకు రిజిస్ట్రేషన్ చేయించుదామని పోయిన. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ‘నీ స్థలం నిషేధిత జాబితాలో ఉన్నది. రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు’ అని సబ్ రిజిస్ట్రార్ చెప్పిండు. నాకంటే ముందు ఆ స్థలం పది మంది చేతులు మారింది. అప్పట్లో రిజిస్ట్రేషన్కు లేని సమస్య ఇప్పుడెందుకొచ్చిందో. బిడ్డ పెండ్లికి అధిక వడ్డీలకు అప్పులు చేసిన. నా స్థలంపై నిషేధం ఎత్తివేయాలని బోధన్ తహసీల్దార్, కలెక్టర్ వద్దకు రోజూ తిరుగుతున్నా లాభంలేకుండా పోయింది. సొంత స్థలాన్ని కూడా అమ్ముకోలేని దుస్థితి రేవంత్రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది.