సిద్దిపేట : సీఎం కేసీఆర్ మానస పుత్రిక కేసీఆర్ కిట్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ కిట్ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వ దవాఖానల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని హరీశ్ రావు అన్నారు.
బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానను మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జనరల్ వార్డు, పిల్లల వార్డు, కరోనా టెస్టుల కేంద్రాన్ని సందర్శించారు. చెకప్ కోసం వచ్చిన గర్భిణులతో మంత్రి మాట్లాడారు.
అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలు, అమ్మ ఒడి వాహన సేవలు, కేసీఆర్ కిట్ల గురించి అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ దవాఖానలకే రావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకు రావడం తో పాటు, కేసీఆర్ కిట్లు నయా పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నట్లు చెప్పారు.
కరోనా పరీక్ష కేంద్రం వద్ద పరీక్షలు చేస్తున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా చేస్తున్న పరీక్షలు, అందిస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కిట్ లో ఉన్న మందులను వాడుతూ దైర్యంగా ఉండాలని సూచించారు.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ, సోకిన వారు ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉందన్నారు.అలా అని నిర్లక్ష్యం చేయవద్దని కరోనా నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కరోనా ఎదుర్కొనేందుకు ప్రభుత్ సిద్ధంగా ఉందన్నారు.
గజ్వేల్ వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రశంస
గజ్వేల్ జిల్లా దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. దవాఖానలో నెలకు 400 డెలివరీలు చేస్తున్నారనీ తెలిపారు.
గజ్వేల్ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే పసిరికలు, ఇతర ఆరోగ్య పరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యవసర వార్డు చక్కగా పని చేస్తుందన్నారు. వైద్యులు పిల్లలకు మంచి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.