హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం పరిధిలోని బాణాసంచా కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషయం ఉన్నది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం..వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కనే ఉన్న సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో టపాకులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడుతో ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బాణాసంచా కేంద్రం పొలాల్లో ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు అంబులెన్స్, ఫైరింజన్తోపాటు వాహనాలు కూడా వెళ్లడానికి కష్టంగా మారింది. దీంతో సుమారు రెండుగంటలపాటు పేలుళ్లు జరగడంతో స్థానికులు అక్కడకు చేరుకునేలోపే అందులో చిక్కుకున్న వారు అగ్నికి ఆహుతయ్యారు.
ప్రమాద సమయంలో 34 మంది పటాకులు తయారీ చేస్తుండగా, వీరిలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వారి శరీరభాగాలు గుర్తుపట్టలేని స్థితిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. మిగిలిన 13 మందికి తీవ్ర గాయాలు కాగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. మృతుల్లో ఎక్కువమంది మహిళలలే ఉన్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పేలుడు శబ్దాలు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని సమీప పొలాల్లో పనిచేసే స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వేట్లపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా, ఈ పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31వరకు ఉన్నదని, పేలుడు తర్వాత యజమాని పరారీలో ఉన్నాడని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు.
11 మంది మృతదేహాల గుర్తింపు
పోలీసులు ఇప్పటివరకు 11మంది మృతదేహాలను గుర్తించారు. వారిలో అడబాల శ్రీను, పీ కృపమ్మ, కడింపల్లి ధనరాజు, ఎస్ సత్యవేణి, వట్లూరి రవి, మందంపల్లి చిన్ని, ఎన్ కరుణ, జీ మంగ, జీ మహేశ్, జీ రాము, జీ నానిగా గుర్తించారు.
ఘటనపై ప్రముఖుల దిగ్భ్రాంతి
వేట్లపాలెం పటాకుల తయారీ పరిశ్రమలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు , మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్తోపాటు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. కాగా, ఘటనా స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించి, ప్రమాద పరిస్థితి గురించి ఆరా తీశారు. తక్షణం బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం చేయడంతోపాటు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.