హైదరాబాద్ : ఓ వ్యక్తి కిడ్నీలో ఒకట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా 206 రాళ్లు బయటపడ్డాయి. ఈ రాళ్లను చూసిన వైద్యులు, అతని కుటుంబ సభ్యులు షాకయ్యారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న బాధితుడికి గంట పాటు సర్జరీ చేసి రాళ్లను తొలగించారు వైద్యులు.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన వీరమళ్ల రామకృష్ణయ్య(56)కు ఆరు నెలల క్రితం కడుపులో నొప్పి రావడంతో స్థానిక వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వాడటంతో నొప్పి తగ్గిపోయింది. కానీ ఆ నొప్పి క్రమక్రమంగా అధికమైంది. భరించలేని నొప్పి రావడంతో.. హైదరాబాద్లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించాడు. రామకృష్ణయ్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో బాధితుడికి గంట పాటు సర్జరీ నిర్వహించి, 206 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం రామకృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేసిన రెండో రోజే ఆయనను డిశ్చార్జి చేశామన్నారు.