JEE Advanced | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్కు 2021-2022 సెప్టెంబర్ 21కి ముందు ఇంటర్ రాసినవారు అర్హులు కాదని ప్రకటించడం తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు తీరని అన్యాయాన్ని తలపెట్టడమే అవుతుందని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా జేఈఈ అడ్వాన్స్ను ప్రముఖ ఐఐటీ నిర్వహిస్తున్నదని, ఈసారి మద్రాస్ ఐఐటీ నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటించకుండా అడ్వాన్స్ రాయడానికి నెల ముందు ఇలా అనర్హులని ప్రకటించడం సరైంది కాదని, అది కుట్రపూరితమని పేర్కొన్నారు.
2019 నుంచి 2022 వరకు దేశంలో కరోనా వ్యాప్తి ఉందని, దీంతో అనేక మంది తెలుగు విద్యార్థులు రాయలేకపోయారని గుర్తుచేశారు. అవేవీ పట్టించుకోకుండా అర్హులు కాదని ప్రకటించడం దారుణమని తెలిపారు. ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ స్థాయి విద్యాసంస్థల్లోకి తెలుగు రాష్ర్టాలతోపాటు దక్షిణాది రాష్ర్టాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, పేద విద్యార్థులు విజయ ఢంకా మోగిస్తున్న తీరును జీర్ణించుకోలేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తెలుగు, దక్షిణాది రాష్ర్టాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అందరికీ న్యాయం చేయాలని పాపని నాగరాజు డిమాండ్ చేశారు.