హైదరాబాద్ : వచ్చే ఏడాది జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి రూ. 200 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు నిధుల విడుదలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓలు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, క్వాలిటీ టీమ్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, మొదటి విడుతలో భాగంగా 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రెండో విడుతలో భాగంగా కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించి, 55 లక్షల మందికి కళ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు హరీశ్రావు తెలిపారు. ఇందులో 30 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల మందికి ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
తొలి సారి 827 బృందాలు పని చేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు చెప్పారు. బృందాలకు అవసరమైన ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని, రెగ్యులర్ సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. డీఎంహెచ్ఓలు బాగా పని చేయాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.