హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నిక సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ర్టానికి ఈసారి కొంత అదనపు బలగాలను పంపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం రాష్టాలకు సంబంధించి ఆయా రాష్ర్టాల పోలీసు ఉన్నతాధికారులతో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. తొలి కీలక సమావేశంలోనే అన్ని రాష్ర్టాల్లోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా రాష్ర్టాల నోడల్ అధికారులకు, ఎక్స్పెండేచరీ మేనేజర్లకు కీలమైన సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారంతో గతంలో కంటే ఈ సారి తెలంగాణ ఎన్నికలకు అదనంగా బలగాలను కేటాయించన్నట్టు తెలిసింది.
గతంలో కంటే 20 వేల మంది అదనం
తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికలకు సరిహద్దు రాష్ర్టాల నుంచి మొత్తం 18 వేల మందికిపైగా పోలీసులను బందోబస్తుకు తీసుకున్నారు. ఈసారి ఆ సంఖ్యను 20 వేలకు పెంచినట్టు సమాచారం. గతంలో కేంద్రం నుంచి 280 కంపెనీలు ఎన్నికల బందోబస్తు రాగా.. ఆ సంఖ్యను ఇప్పుడు 300 లకు పెంచినట్టు తెలిసింది. తెలంగాణలో ఉన్న పోలీసు ఫోర్స్తోసహా కేంద్రం నుంచి అదనంగా వచ్చే వివిధ బలగాలను రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ.. ఎంతెంత ఫోర్స్ను దించాలనే దానిపై కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం మన రాష్ట్ర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది.
పట్టుకున్న డబ్బు, మద్యం వివరాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి..
ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో మద్యం, డబ్బును ఎక్కడిక్కడే అరికట్టేందుకు, స్వాధీనం చేసుకున్న వాటిని వెంటనే ఢిల్లీకి పంపేదుకు ప్రత్యేకంగా ఓ యాప్ను ఈసీ రూపొందించింది. ఈ యాప్లో నమోదైన వెంటనే సంబంధిత ఐటీ అధికారులు, ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం, సొత్తును ఎన్నికల సంఘానికి పంపుతారు. ఆ వివరాలను ప్రతిరోజూ ఆయా రాష్ర్టాల మీడియా సంస్థలకు వెల్లడించనున్నారు. గతంలో ఎన్నికల సందర్భంగా దొరికే మద్యం, డబ్బును వారం, పదిరోజుల తర్వాత సంబంధిత అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపేవారు. ఈ యాప్లో పొందుపరిచే సొత్తు వివరాలు ఇకనుంచి పకడ్బందీగా నిర్వహించనున్నారు.