హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం చేసిన అన్యాయం కారణంగా తెలంగాణ సుమారు రూ.2 వేల కోట్లకుపైగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల కింద కేంద్రం పలు రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఇందులో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. ఈ పథకం కింద కాలేజీ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60% నిధులు కేంద్రం, 40% నిధులు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. వీటికి కేంద్రం తన వాటాగా ఇప్పటివరకు విడుదల చేసిన నిధులపై పార్లమెంట్లో ఎంపీలు ప్రశ్నించారు.
ఈ పథకం కింద తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేటాయించలేదని, ఇతర రాష్ర్టాలకు కేటాయించిన ఒక్కో కాలేజీకి తన వాటాగా రూ.150-200 కోట్ల వరకు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. కేంద్రం వివక్ష ప్రదర్శించినప్పటికీ మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడం, ప్రజలకు స్పెషాలిటీ వైద్యం అందించడమే లక్ష్యంగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 12 నూతన కాలేజీలను ప్రారంభించారు.
ఒకవేళ వీటికి కేంద్రం సాయం చేసి ఉంటే.. ఒక్కో మెడికల్ కాలేజీకి కేంద్రం వాటా సగటున రూ.175 కోట్లుగా లెక్కించినా 12 మెడికల్ కాలేజీలకు కలిపి సుమారు రూ.2,100 కోట్లు వచ్చేవి. కేంద్రం వివక్ష కారణంగా రాష్ట్రం మీద ఈ మేరకు భారం పడింది. అయినా సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయడం లేదు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు.. మరో 9 కాలేజీలను ఏర్పాటుచేస్తున్నారు.