సిద్దిపేట : సిద్దిపేట కాల్పుల ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత తెలిపారు. ప్రధాని నిందితుడు రాజు(26), సాయికుమార్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 34 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మిగతా రూ. 10 లక్షలను అప్పులు తీర్చుకున్నట్లు నిందితులు వెల్లడించినట్లు సీపీ పేర్కొన్నారు. నిందితులు వినియోగించిన తుపాకులపై విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్ టీమ్స్ సమర్థంగా పని చేశాయని సీపీ ప్రశంసించారు. జనవరి 31న సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కారు డ్రైవర్పై కాల్పులు జరిపి, రూ. 43.50 లక్షలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాటకు చెందిన రియల్టర్ నర్సయ్య సిద్దిపేటలో స్థిరపడ్డారు. ఆయనకు హౌజింగ్బోర్డు కాలనీలో ఉన్న ప్లాట్ను శ్రీధర్రెడ్డికి రూ.60 లక్షలకు విక్రయించాడు. మూడు విడతల్లో చెల్లింపునకు ఒప్పందం కుదిరింది. చివరి విడత డబ్బు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేందుకు సోమవారం నర్సయ్య తన డ్రైవర్ పరశురాములుతో కలిసి కారులో ఇన్నోవాలో సిద్దిపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. శ్రీధర్ రెడ్డి తాను ఇవ్వాల్సిన రూ.43.50 లక్షలు చెల్లించాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి సంతకం పెట్టేందుకు నర్సయ్య వెళ్లగా గుర్తుతెలియని దుండగులు మాస్క్లు ధరించి బైక్పై వచ్చారు. కారుపై వెనుక నుంచి దాడికి తెగపడ్డారు. గమనించిన డ్రైవర్ పరశురాములు వాహనాన్ని కొంతదూరం తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
ముందుకొచ్చి కారు అద్దంపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. భయపడి డ్రైవర్ కేకలు వేయటంతో, అతని తొడపై కాల్చి గాయపర్చారు. మరో దుండగుడు పక్క సీట్లో ఉన్న డబ్బుల సంచిని తీసుకొని పరారయ్యారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండుగులు ఉపయోగించిన 9ఎంఎం తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు. క్లూస్టీమ్ ఆధారాలు సేకరించింది.