హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీదుగా రెండు భారీ రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 7,539 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందులో గుంటూరు-బీబీనగర్ మధ్య 239 కి.మీ. రైల్వే లైన్ డబ్లింగ్కు రూ.2,853.23 కోట్లు, ముద్ఖేడ్-డోన్ మధ్య 417.88 కి.మీ. మార్గం డబ్లింగ్కు రూ. 4,686.09 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆయా మార్గాల్లో రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడి రద్దీ తగ్గుతుందని తెలిపారు. ఆహార ధాన్యా లు, ఇనుము, బొగ్గు, సిమెంట్ రవాణా పెరగడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ కారిడార్లకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.