హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది మొదలు.. భారీ స్థాయిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తెలంగాణకు తరలించడం కోసం దాచిపెట్టిన రూ.42 కోట్ల నగదును బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 45 కోట్లకు పైగా సొమ్మును కూడా అదే నగరంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా గుజరాత్ నుంచి తరలించిన రూ.3 కోట్ల నగదును తెలంగాణ పోలీసులు నల్లగొండలో స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారుల ముసుగులో ఇద్దరు గుజరాతీలు తరలిస్తున్న ఈ సొమ్ము గుజరాత్కు చెందిన బీజేపీ నేతలదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఓటర్లకు నోట్లు ఎరవేసి ప్రలోభపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్లు ప్రయత్నిస్తున్నాయేమోనన్న సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలో ఉన్న కర్ణాటక, గుజరాత్ల నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వస్తున్నాయి. గుజరాత్ నుంచి తరలించిన రూ.3.04 కోట్ల నగదును తీసుకెళ్తున్న కారు నల్లగొండ జిల్లాలో రెండుచోట్ల పోలీసులను ఏమార్చి ముందుకు దూసుకెళ్లింది. ముందుగా మాడ్గులపల్లి వద్ద పోలీసులు ఆపుతున్నా డ్రైవర్ ఆపకుండా ముందుకెళ్లాడు. దీంతో ఇక్కడి ఎస్ఐ మిర్యాలగూడ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో మిర్యాలగూడ పోలీసులు ఏదులగూడ వద్ద సదరు కారును ఆపేందుకు ప్రయత్నించారు. అక్కడ కూడా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దులను అప్రమత్తం చేశారు. మూడోసారి వాడపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులు రోడ్డుకడ్డంగా బ్యారికేడ్లు పెట్టడంతో ఆ కారును ఆపక తప్పలేదు.
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో ఈ అక్రమ తరలింపు వెనుక ఉద్దేశమేమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు. పౌరులు రూ.50 వేల లోపు నగదును తమవద్ద ఉంచుకోవచ్చని, అంతకుమించి ఉంటే ఆ డబ్బుకు ఆధారాలు చూపాలని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టంచేసింది. అయినప్పటికీ సరైన పత్రా లు లేకుండా లక్షల రూపాయల నగదును తరలిస్తున్నారు. సోమవారం హైదరాబాద్లోని పలు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు దాదా పు రూ.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గాంధీనగర్ పరిధిలోని కవాడీగూడలో రూ.2.09 కోట్లు, ఎల్బీనగర్ ఎస్వోటీ వద్ద కారులో తరలిస్తున్న రూ.29.40 లక్షలు, సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్లో రూ.32 లక్షలు, గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో మరో రూ.10 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాల్లేకుండా తరలిస్తున్న ఈ సొమ్మంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకా? లేక ఓటర్లకు పంచేందుకా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం తొమ్మిదేండ్లుగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అధికార బీఆర్ఎస్ ప్రజల మన్నన పొందుతున్నది. ఇటువంటి పరిస్థితిలో ఓటర్లకు డబ్బు ఎరవేయడం తప్ప ప్రత్యర్థి పార్టీలకు వేరే మార్గం కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చైతన్యవంతులైన తెలంగాణ ఓటర్లు సంక్షేమాన్ని కోరుకుంటారు తప్ప డబ్బుకు అమ్ముడుపోరు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.