జనగామ : ఆంధ్రా – ఒడిశా సరిహద్దు నుండి తరలిస్తున్న గంజాయిని జనగామలో పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా.. టాస్క్ఫోర్స్, లింగాల ఘన్పూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఆ వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి రూ. 2 కోట్ల 36 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. మొత్తం 1577 కిలోల గంజాయితో పాటు, ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను ప్రభాకర్ రెడ్డి(35), నటేకర్ మహేశ్(32)గా పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రెడ్డి నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలానికి చెందిన వ్యక్తి కాగా, ప్రస్తుతం జీడిమెట్లలో నివాసం ఉంటున్నాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేశ్.. ప్రస్తుతం బోరబండలో నివసిస్తున్నాడు. వీరితో పాటు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరిని ఖాజా (ప్రధాన నిందితుడు), జాన్, మల్లికార్జున్, కృష్ణ, సన్యాసిరావుగా గుర్తించారు.