హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): భారత్లో కెనడా హైకమిషనర్గా పనిచేస్తున్న కామరాన్ మాకే మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో సానుకూల వాతావరణం ఉన్నదని, టీఎస్ ఐపాస్తో అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో ద్వారా శీఘ్రగతిన మంజూరు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామికవాడలను ఏర్పాటు చేశామని, ఇప్పటికే అనేక బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. ప్రస్తుతం ఐటీ, ఫార్మా, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ తదితర 14 ప్రాధాన్య రంగాలను గుర్తించి వాటి అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.
ఫార్మా క్యాపిటల్గా హైదరాబాద్ ఖ్యాతి పొందిందని, ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే కొవిడ్ వ్యాక్సిన్ను ఎగుమతి చేశామని గుర్తుచేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ప్రధానంగా తెలంగాణపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారని, ఇప్పటివరకూ ఇక్కడికి వచ్చిన పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. గత ఎనిమిదేండ్లలో రాష్ర్టానికి రూ.2.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని, వీటిలో యూరప్, ఆసియా, మధ్య ఆసియా దేశాల పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కెనడా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా తగిన సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ కోరారు. దీనికి కామరాన్ మాకే సానుకూలంగా స్పందించారు. భారత్-కెనడా మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయని, తెలంగాణ అభివృద్ధితోపాటు ఇక్కడి పారిశ్రామిక అనుకూల విధానాల గురించి తెలుసుకున్నానని చెప్పారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలు తెలంగాణపై దృష్టి సారించేలా తగిన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి కేటీఆర్కు కజకిస్తాన్ ఆహ్వానం
‘2022 డిజిటల్ బ్రిడ్జ్ ఫోరం’లో గౌరవ అతిథిగా పాల్గొనాలని విజ్ఞప్తి
కజకిస్తాన్లోని నూర్ సుల్తాన్లో ఈ నెల 28, 29న నిర్వహించనున్న ‘2022 డిజిటల్ బ్రిడ్జ్ ఫోరం’ సదస్సుకు ఐటీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. గౌరవ అతిథిగా సదస్సులో పాల్గొనాలని కేటీఆర్ను కజకిస్తాన్ ప్రభుత్వం తరఫున మంత్రి బగ్దత్ ముస్సిన్ కోరారు. ‘ఐటీ, ఆవిష్కరణలలో పోకడలు, సవాళ్లు, పురోగతి’ అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నారు. మధ్య ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక సహకారంపై చర్చిస్తారు. బిగ్ డాటా, క్లౌడ్ సొల్యూషన్స్, పబ్లిక్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో పెట్టుబడులతోపాటు నూతన సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణలపై దృష్టిసారించనున్నది.