హనుమకొండ, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను (Warangal) రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్నాయి. వరంగల్లోని అతి ఖరీదైన స్థలాన్ని అడ్డగోలుగా దక్కించుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేతలు రంగం సిద్ధం చేశారు. బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు అధికారికంగా కైవసం చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ (Hanumakonda) బస్టాండ్ సమీపంలోని 2. 27 ఎకరాల భూమిని బహిరంగ వేలంలో అమ్మేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(KUDA) నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 3న బహిరంగ వేలం ఉంటుందని ప్రకటించింది. అయితే, మొంథా తుఫాను కారణంగా ఈ నెల 14కు వాయిదా వేశారు. కుడా ఇప్పటివరకు వరంగల్ నగర పరిధిలో, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను, ప్రైవేటు వ్యక్తుల భూములను సేకరించి ఇండ్ల స్థలాలుగా అభివృద్ధి చేసి బహిరంగ వేలంలో విక్రయించింది. ఇప్పుడు కుడా ఆధీనంలోని భూమిని కమర్షియల్ ప్లాట్లు లేదా ఇండ్ల స్థలాలుగా అభివృద్ధి చేయకుండానే బహిరంగ వేలానికి సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కోసమే కుడా ఇప్పుడు సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హనుమకొండ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రస్తుత హనుమకొండ బస్టాండ్, ఎల్బీ స్టేడియం, స్పోర్ట్స్ హాస్టల్ నుంచి సబ్ స్టేషన్ వరకు దాదాపు 100 ఎకరాలు ఉండేది. అక్కడ ఓ కుంట ఉండేది. 1085, 1086 సర్వే నంబర్లలోని భూములను సేకరించేందుకు 1855లో నిజాం ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. నిజాం తర్వాత వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ స్థలం ఉన్నది. ఆ తర్వాత కుడాకు మారింది. డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించిన భూమి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ వాహనాల యార్డు, ఇటీవల గుడిసెలు ఖాళీ అయిన స్థలం… తాజాగా వేలానికి ఏర్పాట్లు చేస్తున్న భూమి కలిపి 12 ఎకరాలు ఉన్నది. సబ్ స్టేషన్, డంపింగ్ యార్డు వాహనాల షెడ్డు మధ్యలోని 2.27 ఎకరాల స్థలాన్ని కుడా వేలం వేస్తున్నది. వేలం నిర్వహించే భూమి కమర్షియల్ కేటగిరిలో ఉన్నదా, నివాస స్థలమా అనే విషయమై స్పష్టత ఇవ్వడం లేదు. ఏ కేటగిరీ అయినా ప్లాట్లుగా చేసి వేలం నిర్వహిస్తే పోటీ ఎక్కువగా ఉండి కుడాకు డబ్బులు ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు అస్పష్టతతో పోటీ తక్కువగా ఉంటుందని, కాంగ్రెస్లోని కొందరు ప్రజాప్రతినిధుల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భూములను విక్రయించే ప్రక్రియతోపాటు నిర్వహించే స్థలం విషయంలోనూ కుడా కొత్తగా వ్యవహరిస్తున్నది. విక్రయించే భూమిలోనే ప్రతిసారి వేలం ప్రక్రియ జరిగేది. 2.27 ఎకరాలను ఆ స్థలంలో కాకుండా కుడా ఆఫీసులోనే వేలం నిర్వహించాలని నిర్ణయించారు. భూముల అమ్మకాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అన్ని స్థాయిల అధికారులకు ఇప్పటికే రాజకీయ పార్టీలు, సంఘాలు వినతిపత్రాలు ఇచ్చాయి. భూముల అమ్మకాన్ని ఆపకపోతే నిరసనలు చేస్తామని హెచ్చరించాయి. ఈ కారణాలతోనే కుడా ఆఫీసులోనే వేలం పాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.