శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 15 : సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఏటీఎంలో డబ్బులు దోచుకుపోయిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంలో సీఎంఎస్ కంపెనీకి చెందిన నగేశ్ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో రూ.21 లక్షలను నింపాడు. అర్ధరాత్రి 1.59 నిమిషాలకు ఏటీఎంలో చోరీ జరిగినట్టు భద్రతను పర్యవేక్షిస్తున్న కాల్సెంటర్ నుంచి సమాచారం రాగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఏటీఎం నుంచి రూ.2,00,100ను విత్ డ్రా చేసినట్టు గుర్తించారు. మిగతా రూ.18,99,900ను దోచుకున్నట్టు నిర్ధారించారు. డబ్బులతో పాటు వీ- సెట్ మోడన్ బాక్స్ దోపిడీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. ఏటీఎంను డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ శ్రీనివాస్రావు పరిశీలించారు. క్లూస్ టీమ్తో వివరాలు సేకరించాలని ఆదేశించారు.