హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రెండు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘నమస్తే’ ఫొటోగ్రాఫర్లు అవార్డుల పంట పండించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా 2022, 2023 సంవత్సరాలకు నిర్వహించిన పోటీల్లో 3 క్యాటగిరీల్లో నమస్తే ఫొటోగ్రాఫర్లకు అవార్డులు దక్కాయి. 2022 ఏడాదికి ద్వితీయ బహుమతితోపాటు 8 కన్సోలేషన్ బహుమతులు వరించాయి. 2023 లో 9 కన్సోలేషన్ బహుమతులు దక్కాయి. 2022కు మొదటి బహుమతి శ్యామ్కుమార్ -హన్స్ ఇండియా (వరంగల్), ద్వితీయ బహుమతి బందిగే గోపి-నమస్తే తెలంగాణ (మహబూబ్నగర్), తృతీయ బహుమతి రాజేశ్రెడ్డి- సాక్షి (హైదరాబాద్).. 2023 ఏడాదికి మొదటి బహుమతి అనుముల యాకయ్య-సాక్షి (సూర్యాపేట), ద్వితీయ బహుమతి డీ అశోక్- సూర్య (భూపాలపల్లి), తృతీయ బహుమతి జెల్ల నవీన్- వెలుగు (హైదరాబాద్)కు దక్కాయి. విజేతలకు ఆదివారం రవీంద్రభారతిలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ బహుమతులు అందజేశారు.
2022లో బందిగె గోపికి ద్వితీయ బహుమతి
2022 పోటీల్లో మహబూబ్నగర్ ‘నమస్తే’ ఫొటోగ్రాఫర్ బందిగ గోపికి ద్వితీయ బహుమతి దక్కగా, ఎం శ్రీనివాస్ (మంచిర్యాల), గొట్టె వెంకన్న, మేరుగు ప్రతాప్ (వరంగల్), వినోద్ (వనపర్తి), చంద్రశేఖర్ (జనగామ), రవికుమార్ (సిరిసిల్ల), పీ సైదిరెడ్డి (సూర్యాపేట), ఆర్ ఆకాశ్ (నల్లగొండ)లకు కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. 2023 పోటీల్లో ఆర్ ఆకాశ్ (నల్లగొండ) కన్సొలేషన్ క్యాటగిరీ-1లో, మేరుగు ప్రతాప్ (వరంగల్), బందిగే గోపి (మహబూబ్నగర్), గడసంతల శ్రీనివాస్ (హైదరాబాద్), కపిలవాయి రాజు (నాగర్కర్నూల్)లకు క్యాటగిరీ-2లలో కన్సోలేషన్ బహుమతులు పొందారు. యాదిరెడ్డి (వనపర్తి), పీ సైదిరెడ్డి (సూర్యాపేట), జీ చిన్న యాదగిరిగౌడ్ (హైదరాబాద్), నరేశ్ (యాదాద్రి భువనగిరి)లకు క్యాటగిరీ-3లో కన్సోలేషన్ బహుమతులు దక్కాయి.