హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రోడ్లపై కూడా రాజకీయం చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లే లేకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్ సర్కారు.. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వదలడంలేదు. కోర్ రోడ్ నెట్వర్క్ (సీఆర్ఎన్) కింద గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1542.26 కోట్ల విలువైన 39 రోడ్లను ఒక్క కలంపోటుతో రద్దు చేసింది. కొత్తగా రూ.1,097 కోట్లతో 53 రోడ్లను మంజూరు చేసింది. ఈ మేరకు గత నెల 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రద్దు చేసిన వాటిలో నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాలకు చెందిన రోడ్లు అధికంగా ఉన్నాయి. కొత్తగా మంజూరు చేసిన 53 రోడ్లలో ఒక్క నల్లగొండ జిల్లాకే రూ.300 కోట్ల విలువైన 17 రోడ్లను కేటాయించగా.. ఖమ్మం జిల్లాకు రూ.200 కోట్లతో 7 రోడ్లు, సూర్యాపేట జిల్లాకు రూ.115 కోట్లతో 8 రోడ్లను మంజూరు చేశారు. దీంతో మొత్తం రూ.1,097 కోట్లలో రూ.615 కోట్లు ఈ మూడు జిల్లాలకే కేటాయించినట్టయింది. స్టేట్ హైవేలు, ప్రధాన రహదారుల అభివృద్ధికి ఉద్దేశించిన సీఎన్ఆర్ పథకం కింద జిల్లాల్లో ట్రాఫిక్ అవసరాలను బట్టి రోడ్లను మంజూరు చేయాల్సివుండగా.. రేవంత్ సర్కారు మాత్రం కొందరు మంత్రులు ప్రా తినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే అత్యధిక రోడ్లను మంజూరు చేయడం గమనార్హం.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి వివక్షను ప్రదర్శించలేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే పలు పథకాలను చేపట్టింది. విపక్షాలు గెలిచిన నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలను ఆపలేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిన మధిర నియోజకవర్గంలోనూ అమలుచేయడమే ఇందుకు నిదర్శనం. రోడ్ల విషయంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లోనూ విరివిగా రోడ్లను అభివృద్ధి చేసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్పై ఉన్న ద్వేషంతో ప్రజల అవసరాలను పట్టించుకోకుండా స్వార్థంతో వ్యవహరిస్తున్నది.
గత ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్ల రద్దుపై ఉన్నతాధికారులను వివరణ కోరగా.. మంత్రి ఆదేశాల ప్రకారమే రద్దు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన పనులనే తాము చేపడతామని, రోడ్ల రద్దు, కొత్త రోడ్ల మంజూరులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. కొత్త రోడ్ల మంజూరులో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అధిక ప్రాధాన్యమివ్వడంపై మాట్లాడేందుకు వారు నిరాకరిస్తూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నట్టు తెలిపారు.
గత వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా అనేక రోడ్లకు తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో వాటి మరమ్మతులకు అప్పటి సీఎం కేసీఆర్ రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. ఇందులో దాదాపు సగం పనులు పూర్తికాగా.. ఎన్నికల నేపథ్యంలో మిగిలిన పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన మరమ్మతు పనులను చేపట్టకుండా తాత్సారం చేస్తున్నది. పూర్తయిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.650 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. వాటిని పెండింగ్లో పెట్టింది. కొత్త పనులు చేపట్టకపోగా, గతంలో చేసిన పనులకు కూడా బిల్లులు మంజూరు చేయకుండా వివక్ష ప్రదర్శిస్తున్నది.