PM Modi | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణను తొలి నుంచీ ఆగర్భ శత్రువులా పరిగణిస్తున్న నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి అడుగడుగునా మోకాలడ్డుతున్నది. అవకాశం దొరికిన ప్రతిసారీ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్న కేంద్రం.. తాజాగా ఇండస్ట్రియల్ కారిడార్ల విషయంలోనూ అదే ధోరణి అవలంబిస్తున్నది. రాష్ట్రప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాత ఎట్టకేలకు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లను మంజూరు చేసింది. వీటిలో హైదరాబాద్-నాగ్పూర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-బెంగళూరు ఉన్నాయి. మంజూరుతోనే సరిపెట్టుకున్న కేంద్రం ఇప్పటి వరకు నయాపైసా విదల్చలేదు. ఈ మూడింటిలో కార్యరూపం దాల్చుతున్న హైదారాబాద్-నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్కు రూ.1,600 కోట్లు మంజూరైనా, దానిని బ్యాంకు రుణం రూపంలో మాత్రమే ఇవ్వనున్నట్టు తేల్చి చెప్పింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ పథకం కింద కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ దేశవ్యాప్తంగా మొత్తం 11 ఇండస్ట్రియల్ కారిడార్లు మంజూరు చేయగా, అందులో తెలంగాణకు పైన చెప్పుకున్న మూడు ఉన్నాయి. దశలవారీగా వీటిని అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది.
వీటి అభివృద్ధికి రుణాల రూపంలో నిధులు సమకూర్చేందుకుగాను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ)ను ఏర్పాటు చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం భూములను సమకూర్చుకోవాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ర్టాలదేనని, రుణం రూపంలో ఇచ్చే నిధులను ప్రతిపాదిత ఇండస్ట్రియల్ కారిడార్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ 11 ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం ఈ ఏడాది జూలై 31 వరకు రూ.9,899.89 కోట్లు కేటాయించిన కేంద్రం.. అందులో రూ.9,816.98 కోట్ల వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. కానీ, ప్రస్తుతం ఢిల్లీ-ముంబై, చెన్నై-బెంగళూరు కారిడార్లలో మాత్రమే పనులు జరుగుతున్నాయి. తెలంగాణకు మంజూరు చేసిన 3 ఇండస్ట్రియల్ కారిడార్లలో హైదరాబాద్-బెంగళూరు కారిడార్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నది. హైదరాబాద్-వరంగల్ కారిడార్కు సంబంధించి ఇంకా పేపర్ వర్క్ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్-నాగ్పూర్ కారిడార్లో భాగంగా జహీరాబాద్ను ఇండస్ట్రియల్ రీజియన్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కేంద్రం కేటాయించిన రూ.9,816.98 కోట్లలో ఈ కారిడార్కు రూ.1,600 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను ఎన్ఐసీడీఐటీ ఆధ్వర్యంలో రుణాల రూపేణా సమకూర్చుతారు.
తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టీఎస్ ఐ-పాస్ పేరుతో సులభతర అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యాపిల్ ఐఫోన్లను తయారీ చేసే ఫాక్స్కాన్ సైతం రాష్ట్రంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. పారిశ్రామికవాడల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలకు వివిధ రకాల పన్ను రాయితీల రూపంలో కేంద్రం సహకరిస్తే రాష్ర్టానికి, తద్వారా దేశానికి మరింత మేలు చేకూరుతుంది. అయినా కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తుతున్నట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జహీరాబాద్ సమీపంలోని న్యాలకల్, ఝరాసంగం మండలాల పరిధిలో 12,635 ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)ను అభివృద్ధి చేస్తున్నది. పర్యావరణ అనుమతులు కూడా మంజూరు కావడంతో మొదటి దశలో దాదాపు మూడున్నర వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం జహీరాబాద్ నిమ్జ్ను హైదరాబాద్-నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దేశంలో పారిశ్రామికాభివృద్ధి కోసం గతంలో కేంద్రం మంజూరు చేసిన 16 నిమ్జ్లలో జహీరాబాద్ ఒకటి. దీనిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. జహీరాబాద్ నిమ్జ్ అభివృద్ధికి రూ.3 వేలకోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. తాజాగా ఈ నిమ్జ్ను హైదరాబాద్-నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో చేర్చారు. ఇప్పుడు దీనికోసం రూ.1,600 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఆ మొత్తాన్ని రుణం రూపంలో సమకూర్చాలని కేంద్రం నిర్ణయించడం గమనార్హం. దీన్నిబట్టి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో కేంద్రం వాటా ఏమీలేదన్న విషయం స్పష్టమైంది.
తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన 3 ఇండస్ట్రియల్ కారిడార్లలో ప్రస్తుతానికి హైదరాబాద్-నాగపూర్ కారిడార్లో భాగంగా జహీరాబాద్ నిమ్జ్ను మాత్రమే అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దీనికోసం బ్యాంకుల ద్వారా రుణం రూపంలో కేంద్రం రూ.1,600 కోట్లు సమకూర్చనున్నదని, ఈ నిధులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్-వరంగల్ కారిడార్కు సంబంధించి ఇంకా పేపర్ వర్క్ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారని, దీంతో తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేదని వివరించారు.