హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 16 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని 31 కోర్సులు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపును దక్కించుకొన్నాయి. గతంలో మూడు కాలేజీలకు ఈ గుర్తింపు లభించగా, తాజాగా మరో 16 కళాశాలలు ఈ వరుసలో చేరాయి. ఎన్బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొన్న 39 కాలేజీల్లో నిపుణుల కమిటీలు తనిఖీలు నిర్వహించి, నివేదికలిచ్చాయి.
ఆయా నివేదికల ఆధారంగా రాష్ట్రంలోని 16 కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. ఎన్బీఏ గుర్తింపు దక్కించుకొన్న వాటిల్లో ఐదు కాలేజీల్లో కంప్యూటర్ ఇంజినీరింగ్, మూడు కాలేజీల్లో ఎలక్ట్రికల్, ఎనిమిది కాలేజీల్లో ఎలక్ట్రానిక్స్, ఐదు కాలేజీల్లో మెకానికల్, నాలుగు కాలేజీల్లో సివిల్స్ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. ఈ గుర్తింపు గడువు జూన్ 2026కు కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా, ఈ విద్యాసంవత్సరం మరో మూడు కాలేజీలు ప్రారంభంకానున్నాయి.